54. చిత్రకవి రమణకవి
ఈకవి సాంబవిలాసమను ప్రబంధమును రచియించి వేంకటేశ్వరుని కంకితముచేసెను. ఇతడు 1630 వ సంవత్సరప్రాంతములందున్నట్లు తెలియవచ్చుచున్నది. ఇతని తండ్రియైన యనంతకవి రామరాజ భూషణకృతమైన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్య చేసినందున అతడు పదునేడవ శతాబ్దారంభమునం దుండుట స్పష్టము. సాంబవిలాసములోని పద్యముల నప్పకవి లక్ష్యములనుగా జేకొని యుండుటచేత రమణకవి తప్పక తనసాంబవిలాసమును 1650 వ సంవత్సరమునకు గొంతకాలము పూర్వమే చేసియుండవలెను. కవి తన్నుద్దేశించి యీక్రింది వాక్యములను తనపుస్తకములో జెప్పుకొన్నాడు-
ఉ. ఓరమణాఖ్య సత్కవికులోత్తమ ! మామకమంజులాహ్వయ
శ్రీరమణీయ! నీవిపుడు చేయగ బూనినసాంబలక్షణా
సారసదృగ్వివాహకథ సన్మతి మాకిపు డంకితంబుగా
గూరుపు నీకు గల్గు జయగుర్వచలాయురభీష్టవస్తువుల్.
సీ. సర్వలక్షణసారసంగ్రహం బొనరించి
తనరె మీతాత పెద్దనకవీంద్రు
డలహరిశ్చంద్రనలాధీశ సత్కథా
శ్లేషసత్కృతికి బ్రసిద్ధిగా గ
గవిహితుండౌచు వ్యాఖ్యానంబు వొనరించి
మరియు నిందుమతీసుపరిణయంబు
మొదలైనసత్కావ్యములు చేసి రహిగాంచె
నరయ మీతండ్రి యనంతసుకవి
చిత్రకవిమంజులాన్వయక్షీరవార్ధి
చంద్రమూర్తిని సద్బుద్ధిశాలి వీవు