గీ. అరుణపల్లవములబోలు నాపదంబు
లాపదంబుల బోలును నలకజాత
మలకజాతముబోలు నిత్యముఖలీల
నిత్యముఖలీలబోలు నన్నెలతనడుము.
మ. బిగువుంగుబ్బలు గాంచి మాను నలజంబీరంబు బీరంబు క్రొం
జిగిమోము ల్గని సిగ్గున న్వదలు రాజీవంబు జీవంబు విం
తగ భ్రూరేఖలుచూచి భీతి నిడు గోదండంబు దండంబు త
జ్జగతీమోహనుమ్రోల నున్న చెలులం జర్చింపగా శక్యమే. [ఆ.2]
శా. జోక న్వీడ్కొని చుక్కరేగెను జుమీ శుభ్రాంశుబింబప్రభో
త్సేకంబు ల్తఱిగెం జుమీ కడకువచ్చెం జుమ్మి యీరేము చిం
తాకాలుష్యము లేల బాల మదిలో ధైర్యం బవార్యంబుగా
గోకోయన్గతి గుక్కుటంబు లఱచెం గోకోవిరావార్భటిన్. [ఆ.3]
52. చేమకూర వేంకటకవి
ఇతడు నియోగిబ్రాహ్మణుడు. లక్ష్మణామాత్యుని తనుభవుడు. ఈకవి సారంగధరచరిత్రము, విజయవిలాసము అను పద్యకావ్యములను జేసి తంజాపురీ వల్లభుడైన రఘునాధరాజున కంకితము చేసెను. విజయ విలాసమునకు సుభద్రాపరిణయమని నామాంతరము గలదు. కృష్ణదేవరాయ లించుమించుగా దక్షిణహిందూదేశమునంతను జయించిన కథ నీవరకే మాచదువరులు తెలిసికొని యున్నారు. ఆరాయల యనంతరమున తంజావూరు, మధుర, మొదలయిన ద్రావిడరాజ్యములు పాలించుటకయి తెలుగునాయకులు నియమింపబడిరి. తంజాపురిరాజ్యమునకు చెవ్వరాజు పాలకుడుగా నియమింపబడెను.
గీ. ఠీవి నచ్యుతరాయలదేనియైన
తిరుమలాంబకు జెలియలై తేజరిల్లు