పుట:AndhraKavulaCharitamuVol2.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యలర బ్రకటింపనేర్తు పష్టావధాన కలితశత లేఖినీపద్యగద్యశక్తి
సాటిమీరితి వాంధ్రకర్ణాటచోళ రాజసభలను రెంటూరి రంగనార్య.

గోలకొండ మహమ్మదీయులను, కొండవీడు వినుకొండప్రభువులను జయించి 1579 సంవత్సరమునందు విజయనగరరాజుల పక్షమున బోరాడి విపక్షరాజబృందము నోడించిన కస్తురి రంగనాయనికి కృతిపతియైన రాయభూపతి పెదతండ్రి మనుమడు. భానుమతీ పరిణయము కృతినందునప్పటికి రాయనృపాలునికి యుక్తవయస్సువచ్చిన కొడుకు లుండుటచేత గ్రంథరచన చేసిన కాలము 1620వ సంవత్సరప్రాంతమని చెప్పవచ్చును.

చ. అనుపమభద్రలీల వెలమాన్వయవార్థి బ్రతాపలక్ష్మితో
నెనసినరాయశౌరి జగదేకవదాన్యశిఖావతంస మౌ
ననుచు నుతించుటేమియరు దావిభు డిచ్చినభూరిసంపదన్
ధనదులు రాజులున్ ఘనులు దా రగుచు న్నిఖిలార్థు లుండగన్.

ఇత్యాది పద్యములతో గవి కృతిపతిని బహువిధముల వర్ణించి యున్నాడు. ఈతని కవనము ద్రాక్షాపాకమయి మనోహరముగా నున్నది. శైలిని జూపుటకయి భానుమతీ పరిణయములోని కొన్నిపద్యముల నిందు జూపుచున్నాను.

ఉ. తీరినజాతినీలములతిన్నెలపై బ్రతిబింబితంబులౌ
తారకసౌధమౌక్తికవితానము లొప్పగ జూచి బాలికల్
చారుమృగీమదం బలది చక్కనికప్రపుమ్రుగ్గు లిప్పు డి
చ్చో రచియించినామనుచు సూటిగ నాత్మ దలంతు రప్పురిన్. ఆ. 1.

చ. సుమముల వ్రాలివ్రాలి పరిశుద్ధవసంతకళా ప్తమత్తరం
గములను దేలితేలి యతికాంతసుధామధురోల్లసన్మరం
దము చవి గ్రోలిక్రోలి నవదక్షిణగంథవహానుకూలసం
భ్రమమున సోలిసోలి మదబంభరము ల్విహరించు వామనిన్. ఆ. 2.