పుట:AndhraKavulaCharitamuVol2.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూపల్లి లింగన్న. ఈలింగన్నను రంగరాజు లింగన్నగూఢముగా దిట్టిన యీక్రిందిచాటుపద్యము నప్పకవి యుదాహరించియున్నాడు-



క. రవికోటిధామమయమై
   నవకాంచనయుతము నగుచు నానాటి కొగిన్
   భువిని శివాన్విత మగు నీ
   భవనము జూపల్లి లింగ భవగుణసంగా.

చంద్రికాపరిణయమునందు కాశిరాజుకూతురైన చంద్రికను భీముడు వివాహమాడినకథ వర్ణింపబడినది. ఇతడు పదునేడవశతాబ్దారంభమునుండి 1630-40 సంవత్సరములవఱకును పండితకవిగా పేరుపడి యుండవచ్చును. ఈతని రెండు తెలుగుకావ్యములనుండియు రెండేసిపద్యముల నిం దుదాహరించుచున్నాను.


                చంద్రికాపరిణయము

ఉ. జంగమరోహణాద్రిసదృశంబులు తత్పురి గల్గుభద్రపా
   రంగవరేణ్యము ల్పయికి హస్తము లించుకసాచి యవ్వియ
   ద్గాంగఝురంబు పీల్చి మరి తద్వమధుప్రకరంబు దప్పిసా
   యంగ నొసంగు రంగుగ నిజాఖ్యవహించినచాతకాలికిన్.


ఉ. అంతట రుక్మబాహువసుధాధిపనందన యొక్కనాడు శు
   ద్ధాంతగృహంబు వెల్వడివిహారగతిం జనుదెంచె నెచ్చెలుల్
   చెంతల గొల్వ జంచదళిశింజితరంజితకుంజమంజుల
   ప్రాంతగిళత్ఫలానవరతాంగజఘోటికి బుష్పవాటికిన్.


                 రాఘవ యాదవ పాండవీయము

ఉ. బోరన సద్దునంగడచి పో నెడయీక చరించుమంచు న
   వ్వారిధిగా దలంచి పురివాడలకుం దిగబోలు గేహసం
   స్కారకధూపధూమముమిషంబున మబ్బు దివాంతవేళల
   న్వారవధూటు లందు గలవాలు మెఱుంగులువో గణింపగన్.