39. సవరము చిననారాయణనాయకుడు
ఈకవి కువలయాశ్వచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించి, తిమ్మనరపాలపుత్రుడయిన నారాయణభూపాలుని కంకితము చేసెను. ఈకవి తాను క్షత్రియుడ ననియు, రాయభూపాలుని పుత్రుడననియు చెప్పికొనియున్నాడు. ఈతడు రాయభూపాలునకు దిరుమలాంబ వలన గలిగిన ట్లీక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.-
మ. అత డాతిమ్మమయందు వేంకటనృపాధ్యక్షున్ రిపుచ్ఛేదనో
ద్ధతు రంగాధిపు దిర్మలాంబవలనన్ ధర్మాత్ము గోపాలు ను
న్నతకీర్తిం బిననారనాఖ్య దగు నన్నున్ గస్తురీంద్రున్ సమం
చితకీర్తిన్ రఘునాథ దిమ్మవిభు గాంచెన్ నజ్జనాధారులన్.
కృతిపతి యైన నారాయణభూపాలుడు శ్రీరంగరాజ వేంకటపతిరాయలకు సహాయు డయియుండినట్లు చెప్పబడినందున గవి 1580 వ సంవత్సరప్రాంతములయం దుండినట్లు కానవచ్చుచున్నాడు. మఱియు గృతినాయకుడైన నారనరనాధుడు మట్ల యనంతభూపాలునికాలములో నుండిన ట్లీక్రింది పద్యమునందు జెప్పబడినందునను, కవి పదునాఱవశతాబ్దాంతమునం దుండినట్లు నిర్ధారణము చేయవచ్చును-
సీ. తనమాట చెంజికా తంజాపురీ మధురాధినాథులకు నెయ్యంబు నెఱప
దనసిరి గోలకొండనరేంద్రముఖధరాధవపద్మబంధు లౌదల వహింప
దనకీర్తిమట్లనంతనృపాలముఖ్యగోత్రామరేంద్రులు కొనియాడికొనగ
దనదానగుణముగోదావరీతీరభూనిర్జరేశ్వరులు వర్ణించుకొనగ
వెలయు వేదండగండనిర్గళదవర్గ
ళమదధారాధునీనాధకుముదబంధు
కార్యకృడ్డిండిమారావధుర్యసైన్యు
డతడు ప్రభుమాత్రు డే నారనాధి నేత.