మ. అరవిందాసనవాస వాద్యమరలోకారాధ్యకర్కోటకే
శ్వరకారుణ్యసదాభిరక్షితము భాస్వద్దీప్తిమద్భూసురో
త్కరనిత్యశ్రుతిపాఠనిస్వన ముదాత్తశ్రీ నజస్రమ్ంబు ని
ద్ధరణిం బేర్కొన నొప్పు గార్కొలను గోదావర్యుపాంతంబునన్.
ఒక్క కృతిపతిమాత్రమేకాక కృతిపతియొక్క తాతముత్తాతలును గోదావరిమండలములోనే పుట్టి పెరిగి యక్కడనే సంబంధబాంథవ్యములను జేసికొనుచుండిరి. కవి కృతిపతియొక్క ముత్తాతను వర్ణించుచు నతడు గోదావరి మండలములోని యుండి గ్రామములో సంబంధము చేసికొన్నట్లీ క్రింది పద్యమున జెప్పినాడు-
చ. ప్రెగడనమంత్రి బంధుజనబృందము పేర్కొన నుండిశాసనుం
డగుమతిశాలివీరసచివాగ్రణిపుత్రిక దిప్పమాంబికన్
దగుమహిమ న్వివాహ మయి ధన్యచరిత్రుల గాంచె బుత్రులన్
జగదభివర్ణనీయుల విశాలయశోవిభవాభిరాములన్.
ఈడూరికరణమునకు గృతి యిచ్చినకవియు తద్గ్రామపరిసరమున నివసించువాడే యై యుండవలెనుగాని యెక్కడనుండియో నెల్లూరినుండి వెదకుకొనుచు వచ్చినవాడయి యుండడు. కవి తన గ్రంథములోనే తానాయెల్లనార్యునికి బంధుడును విధేయుడు నయినట్లును తన్నతడింటికి బిలిపించి హరిశ్చంద్ర చరిత్రమును దన కంకితము చేయుమని కోరినట్లును చెప్పిన పద్యములలో నొకటియిందు వ్రాయుచున్నాను-
మ. నను గౌండిన్యమునీంద్రగోత్రజు సుధాంధస్సింధుకల్లోలతు
ల్యనిరాఘాటవచోధురంధరుని డేచామాత్యసత్పుత్రు బా
వనచారిత్రు శశాంకమోళిపద సేవాలబ్ధసాహిత్యస
ద్ధనునిన్ బంధు విధేయు శంకరకవిన్ దాక్షిణ్యపుణ్యాధికున్.
కృతిపతియు గృతికర్తయు నిరువురును గూడ నాఱువేలనియోగులు. వారిరువురును కుతుబ్షా గోలకొండ నవాబుగా నున్నకాల