భవ్యలక్ష్మీవిలాసవిభ్రమము లలరు
చక్రధరమూర్తి పురుకుత్సచక్రవర్తి. [ఆ.6]
చ. ఘనములదర్పణంబు లిభకర్ణతలాగ్రము లెండమావు ల
వ్వనధితరంగము ల్సిరులు, వాయువుముందఱ నిడ్డదీపముల్
వనములబుద్బుదంబులు జలంబులపై లిఖియించువర్ణముల్
తనువులు, రాకుమార పరితాపము వల్వదు నీమనంబునన్. [ఆ.7]
చ. సరసుల దేలి పుష్పవనసంతతిపై గడువ్రాలి సుప్తబం
భరముల దోలి చారుశుకపంక్తుల నేలి ప్రసూనగంధ మా
దరమున గ్రోలి పుష్పితలతాతరు లెక్కుచు పోలి మెల్లగా
జరగగజొచ్చె దక్షిణపు జల్లనిగాలి వయాళిపెంపునన్. [ఆ.8]
__________
24. రామరాజు రంగప్పరాజు.
ఈక్షత్రియకవి సాంబోపాఖ్యాన మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించి శ్రీరంగనాయకున కంకితము చేసెను. ఈకవి కృష్ణదేవరాయనియల్లు డైన రామరాజునకు బెదతండ్రికొడుకు కోనేటి తిమ్మరాజున కాశ్రితుడై యుండినవాడు. కాబట్టి కవి 1550 వ సంవత్సరప్రాంతములం దుండినవా డని నిశ్చయముగా జెప్పవచ్చును. కోనేటితిమ్మరాజునకును రామరాజునకును తాత యగు నార్వీటిరామరాజును, కృష్ణదేవరాయనియల్లు డగురామరాజును, కవి తనసాంబోపాఖ్యానమునం దిట్లు వర్ణించియున్నాడు-