ముప్రత్యయాభావమున పెద్దనార్య శిష్యు డైన బట్టుమూర్తి మహాకవి చేత రచితమైన వసు చరిత్రము నందని వ్రాసి,
"సీ. రాజహంసలుగాని రాజహంసలుగారు
సరసకళాసారసారరుచుల"
అను వసుచరిత్రములోని యీసీసపద్యమును లక్ష్యముగా, జూసి యున్నాడు. బట్టుమూర్తికి నూఱుసంవత్సరములలోపలనే యిట్లు గ్రంథస్థము చేసినవ్రాతను నిరాకరించుటకు ప్రబలప్రమాణము కావలసి యుండునుగదా ?
5. అప్పకవీయములో నుదాహరింపబడి యించుమించు రామరాజభూషణునికాలములోనే రచియింపబడిన లక్షణదీపికలో 416 వ పద్యము తరువాత,
"మంజీర శబ్దమునకు బట్టుమూర్తి వసుచరిత్ర మొదటిపద్యము ప్రథమచరణమున హల్లునకు బ్రయోగము".
అనివ్రాయబడి,
"శా. శ్రీభూపుత్రవివాహవేళ నిజమంజీరాగ్రరత్న స్వలీ,
ఇత్యాది వసుచరిత్రపద్య ముదాహరింప బడియున్నది. సరికాలమువారుకూడా సుప్రసిద్ధుడైన రామరాజభూషణుని బట్టుమూర్తియని భ్రమించుట పొసగ నేరదు గాన నిరువురు నొక్కరేయనుట యధిక విశ్వసనీయము.
ఈరామభూషణకవి మొట్టమొదట రచియించిన కావ్యము వసుచరిత్రము. ఈప్రబంధముతో సరిరాదగిన శ్లేషకావ్యము తెనుగున మఱియొకటిలేదు. ఇందలి వర్ణనలు మిక్కిలి మనోహరము లయి యున్నవి; పదములకూర్పు మిక్కిలి సుందరముగా నున్నది. శబ్దార్థాలంకారము లాహ్లాదకరముగానున్నవి; రసభావాదులు యథాయోగ్యములుగా నున్నవి. ఈగ్రంథము రచియింప బడినతరువాత నేటివఱ