పుట:Andhra-Bhashabhushanamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xi


చో, దానిని బ్రశంసించి యది సంస్కృతమున నుండుటచే సర్వజన సుబోధముగాదని తాను తెనుఁగున వ్యాకరణము రచింపఁబూనినట్లు చెప్పుట కవిజనసహజము గదా. నన్నయభట్టవ్యాకరణము నెఱిఁగియు నెఱుఁగనట్లు నటించుటకుఁ గేతనకవికేమి యావశ్యకత గలదు? నన్నయభట్టవ్యాకరణమునం దనాదరమో, యసూయయో గలిగియుండునని యూహించినయెడల, నన్నయభట్ట వ్యాకరణము సంస్కృతమున నుండుటచే నాంధ్రజనోపయోగశూన్యమనియో, లోపభూయిష్ఠమనియో, లక్ష్యరహితమనియో యేదియో యొకదోషమెంచి దానిని నిరసించి తనగ్రంథమునకుఁ బ్రాశస్త్యము ప్రకటించుకొనుట సహజము. తానీ చిన్నవ్యాకరణము రచించినంతమాత్రముననే వ్యాకరణరచనలోఁ గుమారపాణినులతో సరియగువాఁడని జను లెంచవలయు నన్నంత స్వప్రాశస్త్యాభిలాషిగదా కేతనకవి. ఈవిషయ మీక్రిందిపద్యమునఁ దానే స్పష్టముగాఁ దెలిపి యుండెను.

క. "భాషావేదులు నను విని
   యాషణ్ముఖపాణినులకు నగు నెనయని సం
   తోషింప నాంధ్రభాషా
   భూషణమను శబ్దశాస్త్రమున్ రచియింతున్." 8