పుట:Anandam Manishainavadu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అప్రస్తుతం చేశాడు. అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పెట్టిన పథకం "ప్రజల వద్దకు పాలన"పై సంబంధించిన రమణ ప్రశ్న ఇప్పటికీ గిలిగింతలు పెడుతుంది. ముఖ్యంగా అవధానిని ఇరకాటంలో పడేసే ప్రశ్న అది. దీనికితోడు ప్రేక్షకుల్లో ముందు వరుసలో నాటి చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి కోటగిరి విద్యాధరరావు కూడా ఉన్నారు. ధైర్యంగా రమణ అడిగిన ప్రశ్నకి అవధాని ఆలోచించే సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఆ కాలం గడిచిపోయింది. అయినా నాటి చక్కిలిగిలిని మరువలేము కదా. అప్పటినుంచీ సూరంపూడి వెంకటరమణ "స్టార్ అప్రస్తుతం" అయిపోయారు. కానీ రాజకీయల జోకులు తగ్గించారు. అంటే - అవధానిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక, అవధాన ప్రక్రియకు చెడ్డపేరు తేలేక తగ్గించాడు కానీ ప్రశ్నలు సంధించలేక కాదు.

ముఖ్యంగా అప్రస్తుతం చేసేవారికి సర్కస్‌లో జోకర్‌లా అన్నింటా అవగాహన ఉండాలి. అది మా రమణలో పుష్కలం. రోజూ పేపర్‌లో కార్టూన్లు వదలకుండా చదువుతాడేమో చెయ్యి పదునుగా వెళ్తూంటుంది. అవధాని ఎటు తిప్పినా అడ్డుకోగలిగిన సవ్యసాచి మా సూరంపూడి. సూరంపూడీ...! నీకు అప్పుడే అరవై ఏళ్ళు వచ్చాయా! నాకుమాత్రం కంచుమర్రు నుంచి అత్తిలి, అత్తిలినుంచి కుందవల్లి, కాశిపాడు, పిప్పర... ఎన్నో ఊళ్ళు సైకిళ్లు తొక్కుకుంటూనే వెళ్ళి అవధానాల్లో పాల్గొని తిరిగివచ్చిన రోజులే గుర్తొస్తున్నాయి. అవధానాల పేరు చెప్పుకుని మనం పంచుకున్న అభిరుచులు - అత్తిలి పచ్చిపులుసువారి హోటల్లో పెసరట్టు రుచి చూపించావుగా - ఇప్పుడది నే రుచి మరిగిపోయాను. అ పెసరట్టు రుచి ఎన్నాళ్ళు గుర్తుంటుంతో గానీ, నీకూ నాకూ ఉన్న అనుభూతుల రుచులు ఎన్ని జన్మలకైనా గుర్తుంటాయి సుమా. నువ్వూ, నేనూ మళ్ళీ అవధాన స్వర్ణయుగంలో అడుగుపెడదాం. కొత్త తరం అవధానులు ఐతే పుట్టుకు వస్తున్నారు కానీ, అప్రస్తుత ప్రశ్నలు మాత్రం ఇంకా మనవే - ఇదొకటేచాలు మన కృషికి గుర్తింపు.


  • వ్యాసకర్త బహుభాషావేత్త, వందలాది అవధానాలలో అప్రస్తుత ప్రసంగం నిర్వహించి ప్రముఖ పృచ్ఛకునిగా పేరొందిన వ్యక్తి. వ్యాఖ్యాత్తగా కూడా లబ్ద ప్రతిష్టులు.