పుట:Anandam Manishainavadu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవధాన విందులో అప్రస్తుత వడ్డన

...చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ

నాకూ, సూరంపూడి వెంకటరమణకి సంబంధం ఈనాటిది కాదు. దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం, అప్పటికింకా నేటి ప్రముఖ అవధాని కోట లక్ష్మినరసింహంగారు అవధాని కాలేదు. కోట వారి ద్వారా నాకూ, ప్రఖ్యాత అవధాని ఇప్పుడు గురుసహస్రావధానిగా ప్రాచుర్యం పొందిన కడిమెళ్ళ వరప్రసాద్‌గారికి పరిచయమైన సన్మిత్రుడు రమణగారు. సాంప్రదాయమైన విద్య, ఆధునికమైన భావాలు - రెండూ కలగలిసిన వ్యక్తి ఆయన. తెలుగులో అవధానం దివ్యంగా వెలుగుతున్న రోజులవి. ఊరూరా అవధానాలు, వాటిలో మా పృచ్ఛకత్వాలు - ఏ ఆదివారమూ ఇంట్లో ఉండేవాళ్ళం కాదు.

మొదట మా పరిచయమైన రోజుల్లో రమణ అవధాన క్రీడపట్ల మంచి ఆసక్తితో ఉండేవారు. ఎక్కడ అవధానమున్నా సూరంపూడి ఉండాల్సిందే. ఎన్నెన్నో కబుర్లు పంచుకున్నాం. వాటిలో అవధానాలమీద రమణకున్న పట్టు మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచింది. అప్పటికింకా నేటిలా రమణ గడుగ్గాయి కాలేదు. చాలా సిగ్గరిగా ఉండేవారు. మేమంతా పట్టుబట్టి పృచ్ఛకత్వానికి కూర్చోబెట్టాము. పత్రికా రంగంలో పేరొందిన పెమ్మరాజు బాపిరాజుగారి షష్టిపూర్తి సందర్భంగా అత్తిలిలో జరిగిన అవధానంలో సూరంపూడి వెంకటరమణ తొలిసారి అప్రస్తుత ప్రసంగం చేశారు. నేనుండగా తాను చేయనని రమణ పట్టు. నాతోపాటు ఆయననీ కూర్చోబెట్టి చేయాలని నా పట్టుదల. మొత్తానికి అవధానంలో పృచ్చకుడయ్యాడు. మొదటి పర్యాయమే అద్భుతంగా చేశాడు.

అప్రస్తుత ప్రసంగం అనేది అవధాన విద్యలో జనాకర్షణ కలిగిన అంశం. అవధాని మిగిలిన ఏడుగురు పృచ్చకుల్ని ఎదుర్కొంటూ తీవ్రమైన పాండిత్య, సాహిత్య సమాలోచనల్లో ఉండగా, సాహితీ సమరంలాంటి సీరియస్ అంశంలో ఉండగా "అవధానిగారూ..." అంటూ అత్యంత చిలిపి ప్రశ్ననో, మెలిక ప్రశ్ననో వేసి ప్రేక్షకులకు వినోదం పంచేవారు - అప్రస్తుత ప్రసంగీకులు. ఆ అంశంలో