పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“రాజుల బ్రతుకులు రాజనీతి పాశబద్ధాలై కనిపిస్తవి.”

“అలా కాకపోతే ప్రజలకు ధర్మం ఏలా సన్నిహితం అవుతుంది?”

“అవును ప్రభూ! సాధారణ మనుష్యుడు భరించవలసిన బరువు ఏమి ఉంటుంది! భూమి భరించే శేషునిలా భారం భూపతే భరించవలసి ఉంటుంది. అయితే మా చెల్లెలు విషయం మీకు తెలిసి ఉండదు.”

“ప్రభూ! ఈ ఏడు వసంతోత్సవం జరిపే కార్యక్రమం ఏర్పాటు చేసినారా?”

“ఈఏడు వసంతోత్సవం జరపాలనే ఉత్సాహమేలేదు. నిరుటి వసంతోత్సవంలో శాంతిశ్రీ రాకుమారి తన్ను రతీదేవిగా మీరు ఆహ్వానించినప్పుడు గజగజ వణికింది. ఏ విషయం వచ్చినా పట్టించుకోనిది ఆనాడామె ఎంతో బాధపడింది. ఆ బాధ చూచిన మా కందరకు ఎంతో ఆనందం కలిగింది, బాధచే ఆమెలో చైతన్యం పొటమరించింది కదా అని.”

“ప్రభూ! రాకుమారి శుద్ద సాత్వికమూర్తి. శుద్దసాత్వికులకు అవస్థా భేదములుండవు. ఆ శుద్దసాత్విక స్థితికి ఏదైనా విపరీతావరోధము వచ్చినప్పుడు వారు యింకా పైకన్నా వెడతారు. లేకపోతే కొంచెం క్రిందికి దిగి బాధపడతారు.”

“మా మరదలు పూంగీయ రాజకుమారికి నేనెన్ని రాయబారాలను పంపినా ఆమె అన్నీ పెడచెవిని బెట్టింది” అంటూ యువరాజు మోము చిట్లించుకొని “మహారాజుగారి ఆదేశంవల్ల భట్టిదేవి రాకుమారిని వనరమగా ఎన్నుకొంటిని. శాంతశ్రీ ఇక్ష్వాకుల దౌహిత్రి. ఆమెకు రాజనీతి పరమైన ఆలోచన లేకపోలేదు. వనలక్ష్మి కానంత మాత్రాన ఆమె అందానికి లోటు వచ్చిందా? నేను స్వయంగా వెళ్ళి బ్రతిమాలినాను. ఆమెపై రచించిన గాథా గీతికలు చదివాను; చిత్ర చిత్రాలైన ప్రాభృతాలు పంపినాను. కాని ఆమె నాతో మాట్లాడలేదు. బాపిశ్రీ రాకుమారి నాకుగా దౌత్యంచేసి ఎంతో బ్రతిమాలుకుందట. నాల్గు నెలలు శాంతశ్రీ నాతో మాట్లాడలేదు. ఇంతలో నేను ఉజ్జయిని వెళ్ళినాను. అచ్చటనే రెండునెలలు గడచింది. తిరిగి నేను వచ్చిన తర్వాతకూడా పూంగీప్రోలు (నేటి ఒంగోలు) ఆ బాలకు రాయబారాలు పంపినాను” అని తెలిపినాడు.

వీరపురుషదత్తుడు పరాక్రమశాలి. సుగుణ సౌందర్యములాతని వరించినవి. రాజనీతిలో వక్రబుద్ధిలేని ధీమంతుడా రాకుమారుడు. దక్షిణా పథమందు శాతవాహన రాజ్యము అంతరించిపోతున్నదనీ, తన తండ్రిగారే దక్షిణాపథస్వామి కావలసివస్తుందని వీరపురుషదత్త రాకుమారునకు నిశ్చితాభిప్రాయం కలిగింది. తండ్రిగారికి రాజ్యకాంక్ష లేదు. కాని ధర్మనిర్వహణార్థం సామ్రాజ్యభారం వహించవలసివస్తే వెనుదీయరనీ, ఆ భారంవారు వహించవలసిస్తుందని నిర్ధారణ చేసుకొనే ఈలా తనకు దక్షిణ నాయకత్వం తప్పనిసరి చేశారని వీరపురుషదత్త ప్రభువునకు పూర్తిగా అర్థమైంది.

బ్రహ్మదత్తుని భుజంమీద చేయివైచి “దేశానికీ యుద్ధక్షోభం తప్పదా?” అని అడిగినాడు.

బ్రహ్మదత్తుడు: పశుధర్మం ఏదోరూపంగా మానవజీవితం అడుగున ఉండనే ఉంటుంది. సంపూర్ణ మానవత్వం మానవులలో దీపించినంత కాలము ఈ యుద్ధాలూ, ఈ నాశనాలూ, ఈ రక్తపాతాలు తప్పవు.

అడివి బాపిరాజు రచనలు - 6

60

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)