పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీతమ్మ ఇక్ష్వాకుల కోడలై ఉభయకులములను పవిత్రం చేసింది. తన బాలిక శాంతిశ్రీకి ఈ స్థాణుత్వ మెక్కడనుండి వచ్చింది? మహారాజు పక్క నున్న జేగంటపై నెమ్మదిగా స్పృశించారు. వెంటనే ఇద్దరు అంతఃపుర రక్షక స్త్రీలు అక్కడికి గాలులవలె తేలుతూ వచ్చారు. “మేము రాజకుమారి క్షేమం విచారించుటకు వస్తున్నా” మన్నారు మహారాజు.

ఆ రక్షక స్త్రీలు వెంటచే మాయమయ్యారు. మహారాజు ఆ మజ్చపీఠము నుండిలేచి, ఆలోచనతోనే నడుస్తూ తమ నగళ్ళుదాటి రాజకుమారి శాంతిశ్రీ నగరికి పోయినారు. ఆమె నగరిలోకి మహారాజు వచ్చి పూజా గృహం ప్రక్కగృహంలో కూర్చుండి ఉన్న శాంతిశ్రీని తారసిల్లారు. తండ్రిగారు వస్తున్నారని పరిచారికలు వార్త తీసుకునిరాగానే శాంతిశ్రీ ఆనందమూ పొందలేదు, ఆశ్చర్యమూ పొందలేదు. ఆమె లేచి తండ్రిగారి పాదాలకు నమస్కరించింది. మహారాజు కొమరిత నాశీర్వదించి పీఠం పై అధివసించెను.

16

హారాజు రాజకుమారికవైపు తేరపార చూచి “తల్లీ, చదువు బాగుగ ప్రారంభమైనదా?” అని ప్రశ్నించినారు.

“మహాప్రభూ! చదువు ప్రారంభమైనది.”

“ప్రస్తుతము మీ గురువుగారేమి చెబుతున్నారు?”

“ఏవిషయమూ ప్రారంభించలేదు. ధర్మాలనుగూర్చి ఏవో ప్రశ్నలు వేసినారు వానికి నేను ప్రత్యుత్తరా లిచ్చినాను.”

“మంచిది తల్లీ! చదువు అలాగే ప్రారంభించు. విజ్ఞానవంతులు శిష్యులై నప్పుడు గురువులు ఎక్కడో ప్రారంభిస్తారు.”

“కావచ్చును మహాప్రభూ!”

“తల్లీ! నీకు సంగీతమంటే ఎంతో అభిరుచికదా, ఆ ఉత్తమవిద్య ఎందుకు వృద్దిచేసుకోవు?”

“నాకు సంగీతమంటే ఎందుకో ఇష్టంలేదు.”

“శిల్పం ?”

“శిల్పం తథాగతుని సేవచెయ్యడానికి పనికివస్తుంది. అయినా ఆ విద్యపై మనస్సు పోలేదు.”

“బ్రహ్మదత్త ప్రభువు గొప్ప చిత్రకారులుకూడా తల్లీ! వారి దగ్గర చిత్ర లేఖనం నేర్పుకోవచ్చునుకదా. వారి సంగీత విద్యాశేమషీసంపన్నత సకల జంబూద్వీపంలోనూ కీర్తిని కన్నది. దేవభాషలో, ప్రాకృతాలలో, మన ఆంధ్ర ప్రాకృతంలో ఆ ప్రభువు మహాకవి.”

“నాయనగారూ! నాకు ఏ విద్యమీదా కోర్కె కలగడంలేదు.”

“రాజకుమారీక లందరు నేర్చుకోవలసిన విద్యలుకదా ఇవి?”

“కావచ్చును మహాప్రభూ! నా మనను వానిపై ప్రసరించదు.”

మహారాజు నిట్టూర్పు విడిచి లేచినాడు. మర్యాద ననుసరించి, ఆ బాలిక తండ్రివెంట తనమందిర కవాటంవరకూ సాగనంపి వెనుకకు వచ్చింది.

అడివి బాపిరాజు రచనలు - 6

42

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)