పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీణ, ఒకతే ముఖవీణ, ఒకతె మృదంగము ధరించి వ్యాదము సలుపుచు బృందగానంలో గొంతులు కలుపుచుండిరి.

"ఆరామ తరులతలు
        ఆలకించిన స్వరము
శ్రీరామ పదము లిడు
        చిరుసవ్వడుల గీతి”

ఆ పాట తన ఆలోచనలను పొదివికొనగా మహారాజు అనంతమైన ఆ భావాలలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రభువునకు తన చక్రవర్తి అవసాన స్థితి అనేక రూపాలలో దర్శనమవుతున్నది. అంతటి శాతవాహన సామ్రాజ్యమూ నేడు ఈలా అయిపోయిందేమి? యజ్ఞశ్రీ సార్వభౌముల విజయపరంపరలకు తన బాహుబలమే ముఖ్యసాధనమైనది. ఆనాడు తాను యువకుడు. అయినా వ్యక్తిగత పరాక్రమంలో ఏమి, వ్యూహరచన విధానంలో ఏమి అతిరథ శ్రేష్ఠుడనిపించుకొని ఆంధ్రరాజ్య శ్రతువుల కుక్కలువలె పరిగెత్తించలేదా?

యజ్ఞశ్రీ సార్వభౌముని కొమరిత కుసుమలతాదేవి సుందరీమణి తన్ను వలచివచ్చి స్వయంవరంలో కంఠాన పూలదండ వేచినది. శాతవాహనవంశము నిస్తేజమైపోతే ఎవరు ఈ సర్వదక్షిణాపథమందు ధర్మము అవిచ్ఛన్నంగా నడపగలిగిన మేటి? శాంతిమూల మహారాజు నిట్టూర్పు విడిచినాడు. తరతరాలనుండి ఇక్ష్వాకులు శాతవాహనులకు కుడిచేయివంటి వారు. ఈ రెండు వంశాలకు గాఢమైన బంధుత్వాలూ కలిసినవి. తన పూర్వులు అయోధ్య నేలినారు. తనది రఘుమహారాజు వంశం. ఆ బాలల గాంధర్వంలో ఏవో స్వరమధురాలు ప్రవహించాయి.

“దండకాటవి మధ్య
        గండశిలకే తెలుసు
దివ్యపదముల స్పర్శ
       త్రిదశు లెరిగిన స్పర్శ!”

చక్రవర్తి అంతనీరసుడై పోయినాడేమి? ఆయన సంరక్షణభారం పూర్తిగా తనమీదే పడుతుంది. ఈలోగా తన బావమరిది దాయాది సామంతుల నందరిని కూర్చు కుంటున్నాడు. రాజ్యము ధర్మంగా నడవాలి. ప్రజలు భగవంతుని అవతారము. ప్రజల సంరక్షణ పరమధర్మముగా ఎంచని రాజు లెందుకు? సామ్రాట్టు లెందుకు? ప్రతి మనుష్యుని హృదయంలో అధర్మం ఏమూలనో దాక్కుని ఉంటుంది. మనుష్యుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, రాక్షసిలా విరుచుకుపడుతుంది. రామరాజ్యంలో ధర్మపాలనవల్లనే జగత్ర్పసిద్ధి పొందింది.

“రామచంద్రుని వెంట
        రమణి సీతాదేవి
సీతమ్మ నవ్వులో
       చేరె కాంతులు కోటి. ”

అడివి బాపిరాజు రచనలు - 6

41

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)