పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విలీనము గావించుకొని, మహాసామ్రాజ్యమైనది. రాష్ట్రకూటులు, వైదర్భులు, ఆంధ్రచోళులు, ఆంధ్రభోజులు పులకేశి చక్రవర్తి పాదముల దమకిరీటముల సమర్పించినారు.

ప్రథమ పులకేశి దివంగతుడైన వెనుక చాళుక్య సామ్రాజ్యమున గొన్నివిపత్తులు సంభవించినను, సామ్రాజ్య బలమిసుమంతయు హీనము కాలేదు.

ప్రథమ పులకేశి మహారాజునకు మనుమడైన ద్వితీయ పులకేశి మహారాజును నాతనితమ్ము లిరువురును బాలకులై యున్న దినములలో, మంగళేశ మహాప్రభువు రాజప్రతినిధియై రాజ్య మేలినప్పుడు చాళుక్య సామ్రాజ్యమున నెన్నియో కుట్రలు తలలెత్తినవి. మంగళేశుని యనంతరము ద్వితీయపులకేశి వాతాపినగర సామ్రాజ్య సింహాసన మధిరోహించి, చాళుక్య సామ్రాజ్య రాష్ట్రములన్నియు తిరిగి జయించి, తన రాజ్యముపై దండెత్తివచ్చిన యార్యావర్త చక్రవర్తియైన హర్ష సామ్రాట్టును వింధ్యారణ్య ప్రదేశములలో నోడించి, వెనుకకు దరిమివైచెను, తన విజయమునకై బుద్ధభగవాను నర్చించుచు వ్యాఘ్రనదీ గుహా సంఘారామములో (అజంతాలో) నొక నూతన గుహను నిర్మించి, సంఘారామ భిక్కులకు దానమిచ్చెను. తానర్పించిన గుహలో దన విజయమును బ్రజ్ఞాపూర్ణులయిన చిత్రకారులచే విన్యసింప జేసెను. ఆ చిత్రమున బారసీక రాయబారులు వచ్చి మహారాజును సందర్శింపుచున్నట్లుగూడ విన్యసింపబడెను.

తూర్పు తీరమున చిన్న చిన్న రాజ్యములు బ్రబలి యంతఃకలహములు మెండైనవి. కళింగ నగరాంధ్రగాంగులు, వేంగీనగర విష్ణుకుండినులు, కాంచీపుర పల్లవులు, దక్షిణ కోసలులు నొకరి పైనొకరు తలపడని సంవత్సరమే లేదు. ద్వితీయ పులకేశి యీ యరాజకము నడచుటకు కళింగముపై దండు విడిసినాడు. పిష్టపురమున కళింగుల సామంతుల నోడించి, యా నగరమును స్వాధీనము చేసికొనెను.

అంతటితో నూరుకొనక పులకేశి గాంగరాజధాని దంతనగరము వఱకు బోయి గాంగులను దాసోహమ్మనిపించి, వారిచే గప్పములు గొని, బ్రాహ్మణు లనేకులకు భూరిదానము లిచ్చి దానశాసనములు వేయించెను.

ఆ వెనుక పులకేశి మహాప్రభువు వేంగీపురము జొచ్చి, విష్ణుకుండిన మాధవవర్మ కొమరుడు మంచన భట్టారకునికడ వేంగీనగరమున కప్పముగొని తన సర్వసేనాపతులలో నుత్తముడగు పృధ్వీధృవ రాజేంద్రవర్మను ప్రతినిధిగా నుంచెను. పులకేశి పృధ్వీవల్ల చక్రవర్తి చోళ, పాండ్య, గంగవాటి గాంగుల, వనవాసి కదంబుల నోడించి సామంత సుంకములుగా ధనరాసులు గొనుచు వాతాపిచేరి అశ్వమేధ మొనరించెను. ఆ అశ్వముతో చిన్న తమ్ముడు విష్ణువర్ధన మహారాజు వెడలినాడు.

విష్ణువర్థనుడు వనవాసినగరమున రాజప్రతినిధియై ప్రజలన్ని సౌఖ్యము లనుభవించుచు నానందించుచుండ జల్లని పాలనము సల్పి రాజ్యమేలుచుండెను. ఇంతలో తన ప్రియానుజుడు విషమసిద్ది - విష్ణువర్ధన ప్రభువును రాజధానీ నగరమునకు రావలయునని చక్రవర్తి యాహ్వానమంపినాడు. విష్ణువర్థనుడు హుటాహుటిప్రయాణమై సర్వకాలముల తన్ను అనుసరించియుండు కాలకంపనుని వెంటబెట్టుకొని వాతాపి నగరము వచ్చి చేరినాడు.

అడివి బాపిరాజు రచనలు-6

246

అంశుమతి (చారిత్రాత్మక నవల)