“ఎచట నిదురించితివి సార్వభౌమా
ఎచట మేల్కొందువోయీ
కన్నాకువై భూమి
కన్నాళ్ళు ప్రోచితివి
ఏదేశమేగెదవొ
ఈ రీతి మమువిడిచి
ఎచట.......”
వేరొక వంది :
“సదసుల హృదయుడు
మృదుమధుర జీవి
పూత చరిత్రుండు
పుణ్యుడు దివ్యుడు
బాసెనయా ఈనాడూ
మాసె ధరిణివల్ల కాడూ!”
అని కంటినీటితో పాడినాడు.
నాల్గవదినాన చక్రవర్తిని నాలుగులక్షల ప్రజలు దుఃఖాశ్రులు విడుస్తూ ఉండగా బ్రాహ్మణులు అగ్ని సంస్కారంకోసం లేవనెత్తినారు. సార్వభౌముని దేహం కదలబోతుండగా “మహాప్రభూ! వెళ్ళిపోతావా? నన్ను వదలి ఎలా వెళ్ళగలవు?” అని కేకవేసి మాళవిక నిర్జీవయై నేలమీద నొరగిపోయింది. ఆ పుణ్యాంగనకు భర్తృసహగమనం లభించింది. వెంటనే అందరు ధాన్యకటకం చేరినారు. శాంతిమూలమహారాజు పవిత్ర కృష్ణవేణ్ణా తీరమందు సార్వభౌమునికి ఉత్తమలోక ప్రాప్తికై గోభూహిరణ్యగజ దానాదులు చేసి పితృయజ్ఞం నిర్వర్తించెను.
ఆంధ్రదేశ వాసులయిన ప్రజలు, రైతులు గ్రామగ్రామాన దుఃఖంతో నిండిపోయారు. ఈ వంశం భూమి పుట్టినప్పటినుంచి రాజ్యంచేస్తూ ఉన్న దనే వారు నమ్మినారు. పులమావి ఇంతటి దుష్కర్మపాలయి ఏమీ బావుకుందామనుకున్నాడు అన్నారు. పులమావిని సింహాసన మెలా ఎక్కిస్తా మని రౌద్రహృదయులయ్యారు. “ఇదయ్యా దేశంలో అరాజకత్వం. చక్రవర్తి లేకపోతే భూమిలో ధర్మం నశిస్తుంది అవి వేద ప్రామాణ్యము” అని బ్రాహ్మణోత్తములు ధర్మవాక్యాలు పలికినారు. ఏదో మహాఝంఝ పుట్టే ముందువలె దేశమంతా నిమ్మకు నీరుపోసినట్లుగా ఉంది.
శాతవాహనవంశం అంతరించింది. ఆంధ్రవిష్ణువునుండి ఉద్భవ మందిన ఈ వంశం, విక్రమార్కుని ఎదిరించి నాశనం చేసిన ఈ వంశం, సకలభారతానికీ సార్వభౌమ సింహాసన మెక్కిన ఈ వంశం, ద్వీపద్వీపాల ధర్మప్రచారం చేయించి వన్నె కెక్కిన ఈ వంశం, లోకం అంతా సర్వకళలచే దీపింపచేసిన ఈ వంశం అస్తమించింది.
★ ★ ★
అడివి బాపిరాజు రచనలు - 6
187
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)