పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీవెవరవో ఎరుగనయ్యా!
నితము తెలియని నాకు
          మతికలదంతేగాని
ఓ ప్రభూ నీ చేయి
          నా బ్రతుకు నడదివ్వె
నే నెవరినో తెలియదయ్యా
                    ఓ గురూ!
నీ వెవరవో ఎరుగనయ్యా !

చిన్ననాటినుంచీ శాంతిశ్రీకి సర్వవిద్యలూ ప్రతిభాయుక్తంగా వచ్చేవి. కాని లలితకళలలో సృష్టి ఆమె ఎరగదు. గురువు ఒక చిత్రము చూపి ఈ విధమైన చిత్రము లిఖించు అంటే అయిదు క్షణికాలలో ఆమె ఆ చిత్రం పూర్తిచేసి చూపించేది. ఈ విషయాన్ని గూర్చి ఒక పాట ఈ రీతిగా వ్రాయి అంటే ఆ బాలిక రెండు క్షణికాలలో రచించేది. ఆ పాటలో జీవములేకపోయి గురువు చెప్పిన భావాలన్నీ అందమైన భాషలో గీతికా రూపంలో కూర్చబడి ఉండేది. ఈ రాగిణీ, ఈ రాగము, ఈ తాళము, ఈ మూర్చన, ఈ గ్రామము, వీనితో ఈ రాగంలో, ఈ తాళంతో, ఈ విధంగా పాడాలి అని చూపిస్తే ఆమె అదే విధంగా చేయగలిగేది. చిన్న బిడ్డలచే రామాయణము బుద్ధచరిత్ర కంఠోపాఠము చేయిస్తారు. వాని అర్థము బిడ్డలకేమి తెలుసును? కాని వారు పెద్దవారై రసజ్ఞులు అయిననాడు వాని అందాలు తెలిసికొన్నట్టులు ఇక్ష్వాకు శాంతిశ్రీ ఈ మధ్యనే తాను ప్రజ్ఞతో నేర్చుకున్న సర్వలలితకళలలో ఉండిన దివ్యత్వాన్ని అర్ధం చేసుకోగలిగింది. ఆనాటి నుంచీ ఆమె రచించే గీతికలు, విన్యసించే చిత్రాలు పరమసౌందర్య వికసితాలై ప్రజ్వలించిపోతున్నవి.

ఒక పురుషుని సన్నిధిని ఒక స్త్రీ సర్వకాలము నివసింపగోరడం ప్రేమ అని ఆ బాలిక అర్థంచేసుకొన్నది. తాను బ్రహ్మదత్తుని సాన్నిధ్యము సర్వకాలాల వాంఛిస్తున్నది. ఓహో! తానీనాటికికదా ఇంత ఉత్కృష్ణానుభవ నిధిని పొందగలింది అని ఆమె ఉప్పొంగిపోయింది.

“తారానికా!” ఆమె పిలుపు తెలతెలవారే పులుగు కువకువ అయినది. వెంటనే తారానిక ఆ రాజకుమారికడకు పరుగిడి వచ్చింది. “తారానికా! నీకు ప్రేమ అంటే ఏమో తెలుసును కాదూ?” రాజకుమారి అడిగిన ప్రశ్నకు తారానిక సిగ్గుపడి మోము కెంపువార తలవంచేసింది. రాజకుమారి మోములో నిశ్చలతతో రంగరించిన ఏదో ఒక ఆవేదన ఉన్నది. “తలవంచుకొంటావు, వాత్సాయన మత ప్రకారం అది త్రప అంటారుకాదూ! తారానిక ఇంకా ఆశ్చర్యంపడి పోయినది. ఏమిటీ భర్తృదారికమాటలు!

7

పులమావికి సార్వభౌమత్వము పోయింది. బందీగా ఒక పెద్దభవనంలో బోనులోని సింహంలా తిరుగుతున్నాడు. ఆ భవనంచుట్టూ, యమునికైనా వెఱవని కఱకువీరులు

అడివి బాపిరాజు రచనలు - 6

174

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)