పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాంతిమూల మహారాజు విజయపురం కుమారునికి అప్పగించి తాను సకుటుంబంగా ధాన్యకటక మహాపట్టణం విచ్చేసి అక్కడ తన నగరు ప్రవేశించినారు. ధాన్యకటకం, ధనకటకం, వైభవకటకం, సర్వసంపద్రత్కఖని. ధాన్యకటకం రెండు యోజనాల పొడవు అర్ధయోజనం వెడల్పూగల పట్టణం. ధాన్యకటకం దక్షిణాపథానికి హృదయమే. ధాన్యకటకం చుట్టూ ఉన్న ప్రదేశాలలో పండని పంటలేదు. దొరకని ఖనిజం లేదు. రత్నం లేదు. ధాన్యకటకం విజయశాతవాహనునికి పూర్వం వేయిసంవత్సరాలనుండీ ప్రసిద్ధికెక్కినది.

సింధునది తీరవాసులైన అసురులు హిమాలయాది పర్వతాల లోయలలో నివసించే శుద్ధసత్త్వులైన ఆర్యులధాటికి నిలువలేక సముద్రయానాన పడమటితీరం వెంబడినే ప్రయాణమై నర్మద, తపతి, శబర్మతి నదీముఖాల, తీరాల వలస రాజ్యాలేర్పరచుకొంటూ, తృణజలకాష్ట సమృద్ధిగల తీరద్వీపాలలో నివాసాలు ఏర్పాటు చేసుకొంటూ, కన్యాకుమారి ఆగ్రందాటి తూర్పు తీరానకు కొందరూ సింహళద్వీపం కొందరూ పోయిరి. సింహళద్వీప నదీ తీరాలయందు, కావేరి, వేగై, వేణ్ణాది నదీముఖాలందూ, కృష్ణవేణ్ణా గోదావరీ మహానదీ ముఖాలలోనూ రాజ్యాలేర్పరుచుకొన్నారు.

ఆ అసురులు మహాశైవులు, వృషభేశ్వర సంప్రదాయంవారు. వారు శ్రీకాకుళము మొదలైన పట్టణాలు నిర్మించి ఉత్తమ నాగరికతను వృద్ధిచేసారు. సింధునదీతీరమున నివసించిన ఈ సుమేరులే హిమాలయానికి ఉత్తరంగా ఉన్న మహామేరు (పామేరు) పాదనదీ కంఠాల ఉత్పన్నమైన ప్రథమ ఆర్యజాతివారు. అందుకనే వారికి పూర్వదేవతలు అని పేరు వచ్చింది. తదుపరి ఆర్యఋషులు రామాయణకాలంలో దక్షిణాపథానికి వచ్చి ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇదివరకే రాజ్యాలు స్థాపించు కొన్న అసురుల కది ఇష్టంలేకపోయింది.

దక్షిణాపథానికి అసురులుకాని ఆర్యులుకాని రాకపూర్వం అనాది జాతుల మనుష్యులు నరమాంసం, జంతువుల పచ్చిమాంసమూ తింటూ గుహల్లో, చెట్లలో, పొదల్లో నివాసంచేస్తూ ఉండేవారు. వాళ్ళల్లో పిశాచులు, పొలసు దిండ్లు నక్తంచరులూ మొదలైనవారు వివిధజాతులవారు-తుట్ట పెదవులు, సొట్టముక్కులు, తారునల్లటి శరీరాలు, ఉంగరాలజుట్టు గలవారు - ఉండేవారు.

అసురులూ, ఆర్యులూ రాకపూర్వం తూర్పుసముద్ర ఉత్తర ఈశాన్య దిశలనుండి, సముద్రతీరం వెంబడి నడుస్తూనో, చిన్న చిన్న నావలమీద ప్రయాణం చేస్తూనో గంధర్వ, గరుడ, నాగ, యక్షాదులు - పసుపు, ఎరుపు రంగుల జాతులవారు - తండాలు తండాలుగా వచ్చి తూర్పుతీరం పొడుగునా, గంగా బ్రహ్మపుత్రా మహానదీతీరాలలోనూ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గంధర్వుల ఆదిమనివాసం హిమాలయాల ఉత్తరాన. శాంతిమూలుని కాలంనాటికి అక్కడ ఉన్నవారి పేరు చీనావారు. అక్కడ గంధర్వనాగరికత బహుముఖమై ప్రశస్తి పొందింది.

భరతదేశానికి వలస వచ్చినవారిలో గంధర్వులు హిమాలయ పాదనదీ తీరాలలోను వంగదేశంలోనూ ఎక్కువమంది నివాసాలు రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. తూర్పు

అడివి బాపిరాజు రచనలు - 6

166

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)