నీలోన చేరెనే
పాలసంద్రపు సుడులు
నిన్ను వెలిగించెనే
నింగి తారకలెల్ల
ఏనాడు....”
బ్రహ్మదత్తుడు ఉప్పొంగిపోయాడు. వయసువాడు సన్యాసికావడం పతనానికి సులభమైన దారి అన్నారు. బ్రహ్మచర్యంనుంచి సన్యాసాని కెగిరే ముందు గార్హస్థ్యసౌధ మెక్కాలి. గృహస్థధర్మం లేకుంటే సృష్టి కొనసాగదు. కనుకనే సృష్టిధర్మం నెరవేర్చని మనుష్యుడు పున్నేమనరకంపాలగు నన్నారు. బౌద్ధమతం ఈ పవిత్రాశయాన్ని నాశనంచేసి, అందరు భిక్కులవాలనడంవల్లనే అనర్థహేతువై తానే నాశనమయింది.
ఇప్పుడుకదా శాంతిమూలమహారాజు తన్ను రాజకుమారికి గురువుగా నియోగించిన పరమార్ధము గోచరించింది. శిష్యురాలు పుత్రిక అనే ధర్మం కొన్ని సందర్భాలలోనే వర్తిస్తుంది. ఉదయనప్రభువు దేశికుడై వసంత నేనను వరించిన ఉత్కృష్టచరిత్ర నెరిగియే మహారాజు తన్నీ గురుత్వమున నియోగించెను.
ప్రపంచంలో సౌందర్యానికి మనుష్యుడు ముగ్ధుడవుతాడు. అమృతత్వం కోరే మనుష్యునికి సౌందర్యోపాసనే సులభమార్గం.
“లోకంలో వెన్నెల అంతా
ఏ కారణమో కానీ
నా హృదయంలో రాసికట్టె
నా జీవితమంతా వెలిగె
ఎవరో ఈ సుందరబాలిక
ఏలనో నన్ను వరించెను.
నా జన్మార్థము ఈనాడే
నా కవగతమై తోచిందీ!”
అతడొక నిట్టూర్పు విడిచి ఇదంతా విరహమా, ఆనందమా అనుకున్నాడు. మనస్సు మనస్సు, అగ్నీ నీళ్ళులా ఎదుర్కోనువచ్చును. అమృతమూ సోమరసమూలా పరస్పరం లీనమైపోనూ వచ్చును. దేహాలు వేరు అన్నది ఈ విచిత్ర సాంగత్యానికి ఏమి అడ్డు?
“వెన్నెలలు కాసేను
వీచె మలయానిలుడు
దివ్యామృతమ్మేదొ
నవ్యమై హృదినిండె
వెన్నెలల మర్మమ్ము
వీచు గాలుల మర్మ
మే విచిత్రార్థమ్మొ
ఈ జంటలో ఉంది."
అడివి బాపిరాజు రచనలు - 6
165
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)