“గాజుపూస అన్న నిశ్చయమేముంది బావగారూ?”
“రత్న పరీక్షకులు ఉన్నారు కారా?”
“ఎవరా పరీక్షకులు?”
“తామే!"
“నేనెప్పుడు పరీక్షించాను బావగారూ?”
“ఆ గులకరాయి పుట్టినప్పటినుంచీ తాము పరీక్షిస్తూనే ఉన్నారు.”
“రత్నాలగనిలో గులకరాయి ఏలా పుడుతుంది?”
“నాకు కారణం తెలియదుకాని ఏలాగో పుట్టింది అన్న విషయం తథ్యం.”
“గాజుపూసనే శిరోరత్నాన్ని చేయవలసిన ధర్మం ఆసన్నమైనప్పుడు, ఆ గాజుపూసనే మెరుగుపెట్టి వెనకాల తళుకుపెట్టి పొదగవలసి ఉన్నది.”
“అది ధర్మం అని నిర్ణయించిన వారెవరు?”
“నా హృదయం!”
ఆ మాటలో శాంతిమూలుని మహోత్తమ పవిత్ర హృదయమంతా పుంజీభవించి దుర్నిరీక్షకాంతితో ప్రజ్వలించింది. పూంగీయ స్కందశ్రీ మహారాజు మారుమాట అనలేక పోయినాడు. బావగారిని చూస్తున్న ఆయన కన్నులలో అకుంఠితభక్తి తాండవించింది. ఆయన బావగారికి తలవంచి నమస్కరించి వెళ్ళిపోయినాడు.
ఇందులో తనకు మాత్రం తర్కించవలసిన అవసరం ఏమీలేదు. స్వామి కార్వ పరాయణత్వం సామంతుల ధర్మం అనుకొన్నాడు శాంతిమూలుడు. ఆంధ్రదేశాన్ని శాతవాహనులు తప్ప ఎవరు శాసించగలరు? విశ్వామిత్ర సంతతివారగు ఆంధ్రు లేనాడో ఇక్కడకువచ్చి రాజ్యం స్థాపించారనికదా పూర్వగ్రంథాలు చెప్పింది. నిశుంభాసురుని సంహరించిన ఆంధ్ర విష్ణువు శాతకర్ణులకు పూర్వీకుడు. ఈ దినాన కాకపోతే రేపయినా ఎవరో అటువంటి ఉత్తమ పురుషుడు, గౌతమీపుత్రశాతకర్ణివంటి మహాచక్రవర్తి ఉద్భవించి తీరుతాడీ వంశంలో అనుకొన్నాడు శాంతిమూలుడు.
శాంతిమూలుడు పీఠం అధివసించి ఉండిన్నీ ముందుకువంగి ఉపధానంపై మోచేయి ఆనించి, చేతిలో నుదురునుంచి పదినిమేషాలు ఏదో ఆలోచనల పాలయిపోయినాడు. తాను విజయపురం వెళ్ళడానికి వీలులేదు. ఒక్కలిప్త మాత్రం ఏమరుపాటయినా చంద్రశ్రీ ఏలాగో తనపుట్టి తానేముంచి వేసుకు తీరగలడు. ప్రమత్తత ఏ మాత్రమూ పనికిరాదని శాంతిమూలుడు నిశ్చయించుకొన్నాడు. తలఎత్తి నిట్టూర్పువిడిచి, మళ్ళీ సమభంగా కృతియై ఎవరో ఆ మందిర కవాటందగ్గిరకు వచ్చినట్లు గ్రహించి, “ఎవరక్కడ, ఆ వచ్చిన వారిని రానీ!” అని కేక వేసినాడు. లిప్తలో ఒక ప్రొడాంగన లోనికి అడుగిడింది. ఆమె పూంగీయ శాంతిశ్రీదేవి. పూంగీప్రోలు మహారాణి శాంతిమూలుని చెల్లెలు శాంతిశ్రీ! శాంతిమూల మహారాజు "ఏమమ్మా ఈలా వచ్చావు?” అని నవ్వుతూ ప్రశ్నించినాడు. “అన్నయ్యగారూ! నమస్కారం.. ఆమె పాదాభివందన మాచరించింది. శాంతిమూల మహారాజు పెద్దచెల్లెల్ని ఆశీర్వదించాడు.
“అన్నయ్యగారూ! దేశం అరాజకం అవుతుందని నేను భయపడుతున్నాను.”
అడివి బాపిరాజు రచనలు - 6
161
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)