“నాయనా! మీ తండ్రిగారు కోరికోరి విసుగెత్తిపోయి, చివరికి వారి కోరిక నెరవేర కుండగనే, తపస్సుకు వెళ్ళిపోయినారు. ఎక్కడ ఉన్నదయ్యా మా కోడలు?”
“మీ కోడలా అమ్మా నాకేమి తెలియును? నేను గాథలు పాడుతూ కలలుకంటాను, యుద్ధంచేస్తూ కలలు కంటాను, రాజసభలో కూర్చుని కలలు కంటాను. కలలు కనేవానికి పెళ్ళి ఎందుకు?”
“కలలుకనడం అందరికీ సామాన్యమే. అందరూ పెళ్ళిళ్ళు చేసికొనడం మానివేశారా?”
“అందరూ కలలు కంటారు. అయితే నన్ను తారసిల్లే స్వప్నాలు అవేవో చిత్రంగా ఉంటాయి.”
“చిత్రంగా కలలుకాంచేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా?”
“అదికాదమ్మా! కలలకు పెళ్ళికి సంబంధం ఉందనికాదు, నా విషయంలో కొన్ని చిత్ర విచిత్ర భావాలు నన్ను పొదివికొని ఉన్నాయి. వానికీ నాపెళ్ళికీ సంబంధం ఉంది.”
“ఇదేమి చిత్రమైనవాడమ్మా! ఎక్కడి మనుష్యుడివి నాయనా!” అడవి బ్రహ్మదత్త ప్రభువునకు ఇరువది ఒకటవ సంవత్సరము వచ్చింది. “గృహస్థువైగాని ధనకసింహాసనం ఎక్కకు నాయనా!” అని తండ్రి ఆదేశించడంవల్ల బ్రహ్మదత్తునికి ఇంకా రాజ్యాభిషేకం జరుగలేదు. ధనకరాజ్యానికి ముఖ్యనగరం గురుదత్తపురం.
స్కంధవిశాఖాయనక బ్రహ్మదత్తుడు ఏదో ఆవేదన పడుతున్నట్లు మహాసామంతులు చూసినారు. ఆతని తండ్రి మహారాజు శాంతిమూలునికి మహామంత్రి, మహాసేనాపతి, మహాదండనాయకుడు. ఆ ప్రియబల దేవదత్త ప్రభువు శ్రీశైలం వెళ్ళిపోగానే తానే ఇక్ష్వాకు మహారాజునకు మహామంత్రి, మహాసేనాపతీ, మహాతలవరి, మహాదండనాయకుడు కావలసి వచ్చింది.
శాతవాహనులకు మహాతలవరియై, మహాదండ నాయకుడై, తాతగారు ధనక విజయశ్రీ ప్రభువు తన చిన్నతనంలో తనకు విద్యగరపుతూ “నాయనా! మా తాతగారినుండి విన్న శాతవాహన గాథలు జగదద్భుతములు. శాతవాహన సామ్రాజ్యము తూర్పు తీరంనుండి, పడమటి తీరానికి వ్యాపించి ఉండేది” అన్నారు.
“ఆ స్థితిని దాయాదులమూ, సామంతులమూ అయిన మనం సర్వదా కాపాడాలి” అన్నారు.
నాగర్జునదేవుడు విజయపురంలో నూటపది సంవత్సరాలు ఏమీ ఆరోగ్యం చెడకుండా, కృష్ణవేణ్ణకు ప్రక్కనున్న శ్రీపర్వతాశ్రమంలో ఉన్నారు. చిన్న తనంనుంచీ దేశాలు తిరిగి ఇక్కడే తపస్సుచేసి ఇక్కడే మహాసంఘారామం స్థాపించి పార్వతీయ సంప్రదాయం నెలకొల్పినారు. ఆ సంఘారామ పర్వతం ప్రక్కనే విజయపురం వెలిసింది. ఆ బోధిసత్వుని పేరనే ఆ పర్వతాలకు నాగార్జున పర్వతాలు అని పేరు వచ్చింది.
తన తాతగారు శ్రీ నాగార్జునదేవుడు శివుని అవతారమని బోధించినారు, మల్లికార్జునుడే నాగార్జునుడని వారు చెప్పుచుండేవారు. బౌద్ధులు వారిని బుద్ధావతార మంటారు. ఆ పరమ మహర్షి తనకు గురువులైనారు.
అడివి బాపిరాజు రచనలు - 6
• 9 •
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)