శాంతిశ్రీ మహారాజుకుమారి తన అంగరక్షకులకు తారానికను నాయకురాలి నొనర్చినది. అమెను తన కుడిదిక్కున, యశోదనాగనిక ఎడమదెసను నిలిపినది. ఇరువురు కత్తిసాములో, సాముగరిడీలో, మల్ల ముష్టియుద్దాలలో, ధనుర్యుద్ధంలో అందెవేసిన సుందరీమణులు. ఏ మగవాడైనా వాళ్ళిద్దరితో కత్తియుద్దానికి తలపడడు. వారిరువురకూ భయంలేదు. వారు ప్రాణానికి వెరవరు. రాకుమార్తెను కంటిరెప్పలులా కాపాడుతూ ఉంటారు. కోపం వస్తే ఆడపులులే, ఆనందంగా ఉంటే అందాల అల్లరి పిల్లలు.
తారానిక యశోదనాగనిక గ్రామం వెళ్ళి వచ్చినప్పటినుంచీ నాగదత్త వీరుని తలంపని నిమిషంలేదు. ఆమె కళ్ళలో కాంతి హెచ్చింది. ఆమె వక్షము మరీ ఉప్పొంగి పోతున్నది. ఆమె మూర్తి మరీ అందం తాల్చింది. ఇవన్నీ అంగరక్షకీ నాయిక పరిశీలించి ఈమెకు ప్రేమదయ్యము ఆవేశించింది అని నిశ్చయానికి వచ్చింది. ఈ వీరసుందరి హృదయం చూరగొన సమర్థు డెవ్వడు తల్లీ! అని ఆమె ప్రశ్నించుకొంది. తారానికా, యశోదనాగనికా చాలా స్నేహంగా ఉంటూ ఒక్కనిమేషమైనా ఒకరిని ఒకరు వదల లేకుండ ఉండిరి. పైగా ఈ మార్పంతా యశోదనాగనిక ఊరు వెళ్ళి వచ్చినప్పటినుండీ వచ్చింది. అదీగాక పని విడుపు వచ్చినా యశోద అంతఃపురం వదలి వెళ్ళేదికాదు. ఇప్పుడు తారానిక ఇంటికి పోతున్నది.
యశోదకు అన్నగారొకరున్నారు. అందాలవాడు. మిసిమి వయసువాడు. వీరుడు. బ్రహ్మదత్తప్రభువు అంగరక్షకబలంలో చిన్ననాయకులలో ఒకడు. యశోద ఊరు తారానిక వెళ్ళినప్పుడు నాగదత్తుడు, ఆమె కలుసుకుని ఉంటారు. ఆ విషయం ఎప్పుడు ఊహించుకొందో వెంటనే అంతఃపురాధి కారిణి తారానికను రప్పించింది.
“తారానికా భర్తృదారిక యుద్ధరంగాభిముఖియై వెళుతూ ఉంది. ఆమె చూట్టూ ఉండే ఎనమండుగురు అంగరక్షకురాండ్రలో నిన్ను ముఖ్యనుచేయుమని నాకాజ్ఞ ఇచ్చింది. నీ ఉద్దేశం?”
“అంత అదృష్టానికి నేను తగుదునా? నా ప్రాణాలు పోవాలి. దేవిగారి వంటిమీద ఈగ వాలడానికి!”
“నీ ప్రాణాలు పోయిన వెనుక నువ్వేమి చేయగలవు?”
“నా ప్రాణాలు పోగొట్టుకోను, అమ్మగారిమీద ఈగనూ వాలనివ్వను.”
“అలా ఉండాలిదీక్ష! ప్రణయవిలాసినులు మాత్రం అంగరక్షకురాండ్రుగా ఉండకూడదు. ప్రతిఅంగరక్షకురాలిని నేను కొన్ని ప్రశ్నలడుగుతాను. ప్రతి బాలికా నిజం చెప్పాలి.”
“చిత్తం.”
“నువ్వు ఎవరినై నా ప్రేమిస్తున్నావా?”
"......................................"
“మాట్లాడవేం?”
“చిత్తం! ప్రేమిస్తున్నానమ్మా!” ఆమె మోము వైవర్ణ్య మొందింది.
“ఎవరిని?"
అడివి బాపిరాజు రచనలు - 6
141
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)