పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నారాజు స్తనవల్కలము పాయగాజేసి
 హారాలు చిక్కుపడెనని వాని సరిచేసే"

సరిచేయడంలో ఏముంది? పాటలో రచింపవలసిన వైచిత్య మేమి కలదు?

“నా ఒళ్ళు ఝల్లుమనే నాకళ్లు అల్లుకొనె
 నా ఎడద ఫెళ్ళుమనె నా కోర్కెలుల్లసిలె"

ఏమిది ఈ అల్లరి, ఈ ఝల్లుమనడము? ఈ ఆలోచన రాగానే ఆమెకు ఏదో వివశత్వము కలిగింది. కణతలు వేడి ఎక్కినవి. ఎప్పుడూ ఆకాశాభిముఖియై గుండెపైని చేయినిడి నిదురపోయే ఆ బాలిక భయంతో ఒక్కసారి బోర్లగిలపడి హంసతూలికలుగల వెన్నమెత్తని పరుపునకు గాఢంగా హత్తుకొన్నది. మనస్సులో తళుకు, ఒళ్ళు ఝల్లుఝల్లుమని జలదరించింది. ఏదో మత్తు ఆవహించింది. హృదయంలో ఏదో బాధ. ఆ బాధ తీర్చడానికై తన చిన్నారి బంగారు వక్షోజాలను ఉపధానానికి ఒత్తుకున్నది. ఆమె కన్నుల నీరు తిరిగింది. ఆమె చటుక్కున లేచి త్వరితముగ వాతాయన మార్గముకడకు పోయి మత్తుగా వీచు వసంత మందమలయానిలాలను గుప్పున పీల్చుకొన్నది. ఆమెలో ఆవేదన ఎక్కువయినది. శరీరాంగములు పొంగిపోతున్నవి. కఠినమయిన వాతాయనశిల్ప ఫలకాలను తన హృదయమునకు హత్తుకున్నది, ఇంకను చెంపలు వేడి ఎక్కుతున్నవి. ఒడలు జల దరిస్తున్నది. రోమాంచిము శరీరమంతా విద్యుల్లతవలె ప్రాకిపోతున్నది.

ఆమె మందిరములో నిలువలేకపోయింది. పరుగు పరుగున మందిరాలు దాటి తన ఉద్యానవనంలోనికి పారిపోయి చంద్రశిలా నిర్మిత మయిన కేళాకూళికడ మెత్తని పచ్చికపై వాలిపోయింది. ఏమిది? తనకు దయ్యము పట్టినదా? ఆమె ఆ చల్లని పచ్చికపై దొర్లినది. లేచి ఇన్ని తెల్లనిపూలు మల్లెపొదలనుండి పుణికినది. అవి కన్నుల కద్దుకొన్నది. ఆమెకు ఆవేదన మరీ అధికమయినది. “అబ్బా ఏమిటీ బాధ భగవాన్ పరమశ్రమణకా!” అని అవ్యక్తంగా ఎలుగెత్తి అరచినది. ఎట్టఎదుట బ్రహ్మదత్తుడు తోచినాడు, అతడా? “గురూ! గురుదేవా!” అని ఆమె చుటుక్కున లేచి నిలుచున్నది ఆమెకు ఏదో శాంతి ఆవహించింది. “మీకొరకే ఎదురు చూస్తున్నాను ప్రభూ!” అని ఆమె తలవాల్చింది. ఏదో నిశ్శబ్దము, ఏమిటా నిశ్శబ్దమని ఆమె తలఎత్తినది. అక్కడ బ్రహ్మదత్తుడు లేడు.

(2)

ఎప్పుడు శాంతిశ్రీకి బ్రహ్మదత్తచ్ఛాయ గోచరించిందో ఆ బాలిక కేదో అద్భుతమైన పరమశాంతము సన్నిహితమైంది. ఆమె మోము ఆరుణార్ద్రా రాగపూర్ణమైనది. కాకలీకంఠంతో ఆ బాలిక జ్ఞప్తికి వచ్చిన పాట పాడుకుంటూ భవనంలోనికి నడచివచ్చింది.

“ఇది ఎంతచిత్రమే
 మదవతి పవిత్రమే
 నా హృదయ రమణుడే
 రచింయించే ఈ ప్రతిమ

అడివి బాపిరాజు రచనలు - 6

137

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)