పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ట భాగం

ఇంకో చక్రవర్తి

“సకల ధరాతల ధురంధర భుజాస్కంధా, ఆది వరాహ, చతుస్సముద్ర ముద్రిత మహీమండలాఖండలా!” అని వందిమాగధులు పొగడుతూ ఉండగా హారీతీపుత్ర పులమావి ముసికనగరముందు ఆంధ్రచక్రవర్తిగా రెండవసారి సింహాసనం అధివసించారు.

మొదటిసారి పులమావి ధాన్యకటకస్థుడైన ఆంధ్రచక్రవర్తికి సామంతుడుగా మాత్రం సింహాసనం ఎక్కాడు. యజ్ఞశ్రీ ప్రజ్ఞా, శక్తీగల చక్రవర్తి. ఆయనధాటికి తాళలేక మహా సామంతులూ, సామంతులూ పాదాలకడ శిరస్సులు ఆనించి, తమ భక్తిని వెల్లడించారు. యజ్ఞశ్రీ యశశ్శరీరి కాగానే అనేక సామంతులహృదయాల్లో మళ్ళీ ఆశలుద్భవించాయి. వైజయంతి వారు, ముసికనగరం వారు, మాళవులు, భరుకచ్చులు, అందరూ ఎవరికి వారు చక్రవర్తులు కావాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

అప్పటినుండి పులమావి తగిన సన్నాహాలు చేస్తూ సైన్యాలు కూర్చుకుంటున్నాడు. భరుకచ్చం వారికడ తురంగాలు వేయి కొన్నాడు. ఆయుధాలను సమకూర్చ సాగినాడు. తనరాజ్యంలో బంగారం దొరుకుతుంది. దానిలో సగం ధాన్యకటకానికి పంపవలసినది. “ఈసంవత్సరం ఇంతే దొరికిం”దని “ఈ ఏడు వానలవల్ల బంగారుగనులలో పని బాగా జరుగలే”దనీ చక్రవర్తికి పంపవలసిన బంగారం నానాటికి తగ్గించివేశాడు. బంగారంతో అతని ధనాగారాలు నిండి పోతున్నవి. దానిని వెదజల్లడంవల్ల దక్షిణ దేశాలనుండి విరివిగా యుద్ధవీరులు వచ్చి తన సైన్యాలలో చేరుతున్నారు. దక్షిణాటవుల నుండి వేనకువేలు ఏనుగులపట్టి తెప్పించి వానికి శిక్షణ ఇస్తున్నాడు.

ఈ విషయాలన్నీ శాంతిమూలునికి వేగువస్తున్నాయి. బ్రహ్మదత్తునితో తాను ముసికనగరం వెళ్ళినప్పుడు ఆ యువకప్రభువు “మామయ్యగారూ!” అంటూ సంబోధిస్తూ తాను కట్టవలసిన కప్పం యావత్తూ కట్టివేస్తాడు. అట్టి పులమావి చక్రవార్తి కావలెనని ఆలోచిస్తున్నాడా? ఏమి పొగరు అని శాంతిమూలుడు తనలో తాను ఆలోచించుకొంటూ చిరునవ్వు నవ్వుకొన్నాడు.

బ్రహ్మదత్తుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్న శాంతిమూల మహారాజుకు ఆ అడవి ప్రభువు సురక్షితంగా ఓడతో పూంగీప్రోలు వచ్చి చేరాడని వార్త వచ్చింది. ఆయన ఆనందానికి మేరలేదు. దేశం అంతా ఉత్సవాలు చేయవలసిందని తన ఆజ్ఞగా వార్తలు పంపినాడు. బ్రహ్మదత్తుడంటే ఆదేశాలలోని ప్రజలందరికి దగని ప్రేమ, గౌరవమూ. అలాంటి బ్రహ్మదత్త ప్రభువు సముద్రంలో మాయమై పోయాడన్నప్పుడు దేశం అంతా గగ్గోలు పెట్టింది. నేడు ప్రజల సంతోషానికి మేరలేదు.

బ్రహ్మదత్తుని ఓడ రేవుకువచ్చి ఆగగానే రేవులోని నావికులందరూ గుర్తించి జయ జయ ధ్వానాలు చేసిరి, వివిధ నౌకానాయకులు, నావికులు నౌక వైపుకు పరుగులిడినారు.

అడివి బాపిరాజు రచనలు - 6

118

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)