పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(3)

అంత వృద్ధుడయ్యూ నాగార్జునపుడు ముప్పదియేండ్ల దివ్యశరీరం కలవాడు. ఆయన మాటవణకదు, ఆయన వినికిడి అతినిశితము. ఒక ఏడు పై బడుతున్న కొలదీ ఆ అవతారపురుషుడు ప్రాపంచిక శక్తి మరీబలవత్తరమగుచూ ఉన్నది. ఆయన పండుకొనడు. అహోరాత్రము లరవై ఘడియలు ఏదో పరమయోగాన యోగాసనబద్దుడై, సమభంగికా మూర్తియై, కైలాస పర్వతశిఖరంలా వెలిగిపోతూంటాడు.

ప్రతిదినము తెల్లవారుగట్ల ఆ అవతారమూర్తి లేచి ఆ కొండమీదనే ఉద్భవించే పాతాళగంగాజలంలో కృతావగాహులై, కాషాయాంబరము ధరించి యోగాసనముపైన కూర్చుంటారు. నిర్వకల్పమైన మహాసమాధిలోనికి పోయి ఆయన మూడుఘడియల కాలం అనంత విశ్వాత్మలో లీనమైపోతారు. యోగంలోనుంచి మరల ఈప్రపంచంలోనికి రాగానే ఆ భోధిసత్వుడు కన్నులు తెరిచెదరు. నలుగురు ఆంతరంగిక శిష్యులు ఆయన కన్నులు తెరవగనే ఎదుటకు వచ్చి సాష్టాంగపడి లేచి పద్మాసనస్థులై ఆ దేవుని ఆజ్ఞలకు నిరీక్షింతురు. ఒకరు తాటాకుల గ్రంథము, గంటముతో సిద్ధముగా నుందురు. ఇంకొకరు భూర్జపత్రము, మషీపాత్ర, తూలికతో సిద్ధముగా నుందురు. ఇరువురు ఏకసంధాగ్రాహులు.

స్వచ్చమై, మధురమై, గంభీరమైన శుద్ధాంధ్ర ప్రాకృత భాషలో ఆ మహాభాగుడు వారికి నూతన సూత్రములు, ప్రాచీనగ్రంథాలకు భాష్యాలూ, వ్యాఖ్యానాలూ ఉపదేశింతురు. నలుగురకు నాలుగు గ్రంథాలుపదేశింతురు. ఆ సమయంలో ఆయన పెదవుల వెడలిన మాటలు అమృతకిరణాలై లోకమంతా ప్రసరించును. ఒకరికి రాసాయనికి సూత్రములు చెప్పుదురు. ఇంకొక శిష్యునికి జ్యోతిష్యము. ఈ గ్రంథాలు భూర్జపత్ర లేఖకుడు తాళపత్ర లేఖకుడున్నూ వ్రాయుదురు. మతధర్మాదికాలు ఏకసంతగ్రాహులగు శిష్యులు విందురు. ఈ రీతిని సూర్యోదయాత్పరం ఒక యామంవరకు జరుగుతుంది.

రెండవయామమంతా వివిధదేశాలనుండి అనేకులు, వివిధ విషయాలలో ఈ అవతార పురుషుని పవిత్రాలోచన కోరివచ్చినవారికి ఒకరితర్వాత ఒకరికి ఆ బోధిసత్వులు ఆలోచన చెప్పుదురు. సూర్యుడు ఆకాశమధ్యస్థుడగు నంతవరకూ ఈ రీతిగా సాగుతుంది. ఆ వెనక ఇరువురు భిక్కులు వచ్చి ఆ పరమ పురుషునకు ఫలాహారం సిద్ధమాయెనని నివేదింతురు.

నాగార్జునదేవుడు దేశాలన్నీ పర్యటనచేసి తిరిగి ఆంధ్రభూమి వచ్చినప్పుడు పులమావి చక్రవర్తి తనకు నిర్మించి ఇచ్చిన ఆశ్రమమూ, ఆశ్రమమున్న పర్వతానికి దిగువ లోయలో ఉన్న అపర వనశైలసంప్రదాయ సంఘారామాశ్రమ విహారాదులూ, చైత్యాలూ ఏ మహాదాతలూ చూచే దిక్కులేక దీనావస్థలో ఉన్నాయి. మహాసాంఘికులు ములకదేశంలో ప్రతిష్టానానికి ఉత్తరంగా ఉన్న భగీరాశ్రమ భగీరాశ్రమ సంఘారాశ్రమములకు అనేకులు వెళ్ళిపోయినారు.

సముద్రా లావల ఉన్న ద్వీపాలలో వలసలేర్పరచుకొన్న అనేకులతో భిక్కులు, భదంతులు, ఆచార్యులు సువర్ణ ద్వీపంలో త్రిలింగ మహానగరానికీ, కాకులానికీ, మలయ

అడివి బాపిరాజు రచనలు - 6

114

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)