పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రి

కొన్ని కోట్లకోట్ల సంవత్సరాల క్రిందట నువ్వు రూపెత్తి ఉంటావు ఆంధ్రదేవీ! ఆ దినాలలో, ఆ వేడిలో, ఆ ఉబికిపోయే అగ్నికుండాలలో, ఆ మెట్టలలో, పల్లాలలో, ఆ ఉబ్బలిలో, ఆ మట్టల మహారణ్యాలలో ప్రయాణం చేసే నీ బిడ్డలు గోదావరీ కన్నబెన్నాది వాహినులు నీతోపాటే అవతరించిన సముద్రుణ్ణి చేరడానికి ఎంత ఆయాసపడిపోయినవో!

లక్షలు లక్షలు సంవత్సరాలు నీవు బాలగండాలుదాటి, చల్లబడిన వెనుక జంబూద్వీపపు టొడిలో ఆడుకొంటూ, ఉదయ సముద్రతీరాల ఇసుకలతో బొమ్మరిళ్ళు కట్టుకునేదానవు. ఆ నాళ్ళలో నీవు శూన్యకటీరవు. ఆంధ్రభూమీ! ఇంకను లక్షల సంవత్సరాలు గడిచాయి సుమా! నీ నదుల ఒడ్డులతో అడవులు భూగర్భంలో ఇంకి బొగ్గుగనులవుతున్న ఘడియలవి. వికృతరూపాలతో వీర విహారంచేసే ఆ సరీసృపాలు నశించాయి. కొత్త జంతువులు క్రిములు, కీటకాలు ఉద్భవించాయి. ఆ దినాల్లోనే తమః ప్రధానుడైన మానిసి నీ అంకతలాన ఆడుకొన్నాడు. ఆ రెండుకాళ్ళ జంతువుకు ఏ కొంచెమో మనస్సు ఉంది. అతడు రాత్రించరుడు, ఆతడు మాంసా శనుడు.

ఇంకా లక్షల సంవత్సరాలు గడిచినాయి. సాత్విక రాజసులైన అసురులు సముద్రతీరాల రాజ్యాలు ఏర్పరుచుకొన్నారు. వారు పొడుగరులు, తెల్ల మేనులవారు, పైడివన్నె కేశపాశాలవారు. ఆర్షమూ అనార్షమూ అయిన భగవద్విచారము చేయగలవారు.

ఓ గోదావరీ, ఓ కృష్ణవేణీ! మీరు వీరప్రసవిణులు. సంస్కార ప్రియులైన ఆ అమరసంతతులు మీ తీరాల అనేక నగరాలు నిర్మించారు. వారి నగరాలు జగత్ప్రసిద్ధి పొందినవి. వారు శివపూజాధురంధరులు. గోదావరీ కన్నబెన్నల వెన్నుదన్ని పుట్టిన సింధునదీ తీరాలలో ఎంతో నాగరికత వృద్ధిచేసుకొని, హిమాలయ లోయలనుండి దిగివచ్చిన ఆర్యజాతులవారి వలన ఆ అసురులు ఓడిపోయారు. అంతట పశ్చిమ జంబూ ద్వీపం పొడుగునా వారు సముద్రయానం చేస్తూ పశ్చిమసముద్రంలో లంక మొదలయిన దీవులలో కొందరు ఆగిపోగా, మిగిలినవారు ఇంకా దక్షిణానికి పోయి ఆ దినాలలో ఇంకా పేరులేని కన్యకాగ్రం చుట్టివచ్చారు. వారిలో కొందరు కావేరీ ముఖద్వారంలో ఆగిపోయారు. ఇంకా కొందరు ఉత్తరంగా వచ్చి దక్షిణ పినాకిని ముఖద్వారంలో ఆగారు. ఇంకా కొందరు ఉత్తర పినాకిని కన్నబెన్నా గోదావరీ ముఖద్వారాలలో ఆగినారు దీవీ!

ఇంకా కొన్ని వేల సంవత్సరాలు గడచినాయి. అసురుల అన్నదమ్ములైన ఆర్యులలో విభేదాలు పొడమి, ఆంధ్రు లనేవారు విడిపోయి మెట్ట దారిని వింధ్యను దాటి ఉత్తరకళింగం, అక్కడనుండి గోదావరీతీరం చేరుకొన్నారు. ఆంధ్రులలో కొందరు తెలుగునదితీరాన ఆగిపోయినారు. కొందరు గోదావరి తీరాన ఆగిపోయినారు. కొందరు కన్నబైన్నా తీరానకు వచ్చి ఇదివరకే అచట వృద్ధిపొంది ఉన్న అసురులతో యుద్ధాలు సలపడం ప్రారంభించారు. ఆంధ్రరాజయిన విష్ణువునకు, అసురుడగు నిశుంభునకు ఎంతకాలమో యుద్ధం జరిగింది. నిశుంభాసురుడు హతుడైనాడు. ఆంధ్ర వంశ్యులు ప్రభువులైనారు. ఓ ఆంధ్రవసుంధరా! అంత నీపైడి కడుపున ఆంధ్రబాల అవతరించింది.

చంద్రకళ

ల్లీ, ఆంధ్రవసుంధరా! నువ్వు చంద్రకళాదేవివి! యుగ యుగాలనుండి అసురులకు చంద్రకళే దేవి. ఐసీస్, ఇస్తారతీ! ఈశానీ! ఈజిప్టులో, అసురదేశంలో