పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

తాంబూలచర్వణం కాగానే, స్కందశ్రీ మహారాజూ, బ్రహ్మదత్తప్రభువూ ఆలోచనా మందిరాని కేగిరి.

“మహాప్రభూ! మా మహారాజుగారు, తమ్ము సకుటుంబంగా విజయపురంలో జరుగబోయే వసంతోత్సవాలకు ఆహ్వానింప నన్ను పంపినారు. వారి రాయబారిగా మహాప్రభువులను సకుటుంబంగా ఆహ్వానిస్తున్నాను.”

“బ్రహ్మదత్తప్రభూ! ఇక్ష్వాకులకు, మాకు అరమరికలు లేవని మీరెరుగనిది కాదు అయినా, చిన్నవారికి రాచకార్యాలు అవగాహనకావు. క్రిందటి వసంతోత్సవంలో అమ్మాయి మనస్సు చాలా బాధపడినట్లుంది. ఈ సంవత్సరం వసంతోత్సవాలు ఇక్కడే చేయాలని ఆమె మరీ మరీ పట్టుపడుతున్నది. యువరాజూ చెల్లెలి మాటే లెస్స అంటున్నారు.”

“నేను రాజకుమారితో, యువరాజుగారితో మాట్లాడి వారి మేనమామ ఆహ్వానం వారి కందియ్య దలచుకొన్నాను ప్రభూ!" ,

స్కందశ్రీ మహారాజు “అది బాగుంది, ప్రభూ!” అని బ్రహ్మదత్త ప్రభువునకు వీడ్కోలిస్తూ వారిని తమ మందిరాల ముఖద్వారం వరకూ సాగనంపినారు.

బ్రహ్మదత్త ప్రభువు తమ విడిదికిపోయి, వస్త్రాలు మార్చుకొని, కొందరు గాయనీమణులు వీణాది వాద్యాలపై వాయిస్తూ మధురకంఠాలతో పాడుతూ ఉండగా ఆలకిస్తూ పది లిప్తలు విశ్రమించెను. సాయంకాలం కోటలోని భేరీ పదవ ముహూర్తము మ్రోయించేవేళకు నిద్రలేచి, స్నానంచేసి శుభ్రవస్త్రాలు ధరించి, అలంకారికుడు అలంకరించిన వెనుక, చతుశ్శాలలోనికి, అక్కడనుండి పూర్వసభాగృహంలోనుండి పాంగణానికి వచ్చి, తనకై సిద్ధంగా ఉన్న నాలుగు గుఱ్ఱాల రథాల ఎక్కి అడవి స్కంద విశాఖాయన బ్రహ్మదత్తప్రభువు యువరాజు దర్శనార్థం వెళ్ళినాడు. తన్నెదుర్కొన వచ్చే పూంగీయ స్కంద సాగరనాగయువరాజును కలుసుకొని, కౌగిలించుకొన్నాడు. ఈ ఇరువురు యువకులు కలిసి క్రీడాగృహానికి వెళ్ళినారు.

బ్రహ్మదత్తుడు: ప్రభూ! మీ మేనమామగారు తమ్ము, రాకుమారిని స్కందశ్రీ మహాప్రభువును, మహారాణిని ఈ ఏడు విజయపురంలో జరిగే వసంతోత్సవాలకు ఆహ్వానింప పంపినారు.

స్కందసాగరనాగ: బ్రహ్మదత్తప్రభూ! మా సోదరికి ఈ ఉత్సవాలపై అంతగా ప్రతి ఉన్నట్లు లేదు. ఆమె రాకుండా మేము రాగలమా అని ఆలోచిస్తున్నాము. .

బ్రహ్మ: మీరు చెప్పింది ఆలోచించవలసిందే. రాజధర్మాలు మీ రెరుగనివికావు. రాకుమారి వైమనస్యానికి కారణాలు లేవననుగాని క్షత్రియుత్వం అవలంబించిన బ్రాహ్మణులం మనం. అటు క్షత్రియధర్మమూ నెరపాలి, యిటు బ్రాహ్మణ ధర్మమూ నెరపాలి. శ్రీరామచంద్రుడు రాజధర్మం కోసం కదా సీతాదేవిని అడవులకు పంపించింది.

స్కందః ప్రభూ, ఏమిటా రాజధర్మం?

బ్రహ్మ: ప్రజారంజనమూ, శాంతిని.

స్కందః ప్రజాశాంతి అంటే?

అడివి బాపిరాజు రచనలు - 6

94

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)