పుట:Ammanudi july 2018.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్పినట్లు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళుల పెత్తనమే ఉంటే మద్రాసు రాష్ట్రానికి అగరం సుబ్బరాయలురెడ్డి, పానగల్లు రాజా, కుమారస్వామి రాజా, కె.వి.రెడ్డి, బొల్లిని మునిస్వామినాయుడు, టంగుటూరి ప్రకాశం, ఓమండూరు రామస్వామి లాంటి తెలుగువారే ఎందుకు ముఖ్యమంత్రులయినారు. మదరాసు నగరానికి మొదటి మేయర్ పిట్టి త్యాగరాయశెట్టి తెలుగువాడే. తమిళుల పెత్తనం అంతగా ఉన్నప్పుడు తమిళులెందుకు ఉన్నత పదవులను పొందలేకపోయారు. దీనిని బట్టి చూస్తే ఆనాడు పెద్దలు చెప్పిన 'తమిళుల పెత్తనం' అనే మాట ఒట్టిది. ఆనాటి ఆంధ్రోద్యమకారులు చెప్పిన ఇంకొక ముఖ్య కారణము కృష్ణానది నీళ్లు. ఇప్పుడు నాగార్జునసాగర్ వున్నచోట కాకుండా, ఇంకా ఎగువన ఆనకట్ట కట్టి, కాలువల ద్వారా దక్షిణాన చెంగల్పట్టు వరకూ నీళ్లివ్వాలని అప్పటి మదరాసు రాష్ట్ర ప్రతిపాదన 'పన్నులు తెలుగు వారి దగ్గర కట్టించుకొంటూ, నీళ్ళు అరవలకా?' అని ఆంధ్రులు ఆనాడు గర్జించారు. నిజానిజాలను చూస్తే, అప్పటి మదరాసు రాష్ట్రం చెప్పిన ఈ కాలువ నీళ్ళు గుంటూరు, కృష్ణా జిల్లాలకే కాక, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల గుండా చెంగల్పట్టుకు చివరలో చేరేవి. వీటిలో అరవప్రాంతాలు ఏమున్నాయి? మదరాసు నగరానికి కేవలం 50 కిలోమీటర్లు దక్షిణంగా వుండే చెంగల్పట్టు అరవ ప్రాంతం కానేకాదు అచ్చమైన తెలుగు ప్రాంతం. మరి ఉద్యమం ఎందుకు చేసినట్లు? (ఇంత ఉద్యమం చేసీ ఆంధ్రప్రదేశ్ ఏర్పరచుకొని, చెంగల్పట్టునూ, మదరాసునగరాన్ని తమిళులకు అప్పగించి, తీరుబాటుగా మళ్లీ ఇప్పుడు ఆ కాలువనే తెలుగుగంగ పేరుతో తవ్వినారు) ఏతా - వాతా తేలేదేమిటంటే, అప్పుడు జరిగిన ఉద్యమం తమిళుల పైన కోపంతో కాదు. దక్షిణజిల్లాల తెలుగువారి పైన కోపంతో, ఉత్తర జిల్లాలవారు ఉద్యమించినారు. అప్పుడు అధికారంలో వున్న తెలుగువారంతా (ఒక్క ప్రకాశంగారు తప్పిస్తే) దక్షిణజిల్లాలవారే కదా? ఆ ఉద్యమానికి భాషను ఒక ఆయుధంగా ఎన్నుకొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వేర్పాటు వాదాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు వేర్పాటువాదులు కూడా నీళ్ళూ, భాషలోని యాసా ఆయుధాలుగా చేసుకుని ఉద్యమిస్తున్నా, వారి అంతరంగంలో అధికారం చేపట్టినప్పుడు అసలు కారణం. అప్పుడు జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఆయా రాష్ట్రా లలో మిగిలిపోయిన తెలుగువారు నిస్సహాయు లయిపోయినారు. ముఖ్యంగా తమిళనాడులో తెలుగు వారి పైన ఒత్తిడి పెరిగిపోయింది. ఏం మాట్లాడినా 'మీకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేసినా, ఇంకా ఇక్కడ మీ పెత్తనం ఏమిటి?' అని తమిళులు నిలదీయ సాగినారు. విధిలేని పరిస్థితుల్లో తల్లిమాటకు తెలుగువాడు దూరం కావలసి వచ్చింది.

ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం జరిగుండకపోతే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి వుండకపోతే దక్షిణాది అంతా కలిసి దక్షిణప్రదేశ్ రాష్ట్రం ఏర్పడివుంటే, ఈనాడు భారతదేశంలో తెలుగు తిరుగులేని స్థానంలో వుండుండేది. తెలుగుకన్నా చిన్న భాష అయిన హిందీ ఎట్లా అయితే ఉత్తరాది అంతా అల్లుకుందో, అట్లా తెలుగు దక్షిణాది అంతా అల్లుకుపోయి వుండేది. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఇతర భాషీయులు కూడా తెలుగును నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుండేవారు.

(2003 ఏప్రిల్ - నడుస్తున్న చరిత్ర నుండి)

మీకు తెలుసో, లేదో

  1. ప్రస్తుతం 'ఒరిస్సా'గా పిలుస్తున్న కళింగ ప్రాంతాన్ని కళింగగాంగులు తొమ్మిది వందల సంవత్సరాలు పరిపాలించి నారు. వీరి మాతృభాష తెలుగు.
  2. కేరళలో ప్రసిద్ధిచెందిన రామనాట్టం, కృష్ణనాట్టం అనే శాస్త్రీయ నృత్యాలు సంస్కృత భాషలో నడుస్తాయి. ఈ నాట్య గ్రంథాలు తెలుగు లిపిలో ఉండేవి.
  3. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎల్లోరా, కోణార్క్, పూరి, మధుర, మహాబలిపురం దేవాలయాలను తెలుగు రాజులే నిర్మించారు.
  4. ఒడియా భాషలో అద్భుతమైన ఆధ్యాత్మిక రామాయణాన్ని వ్రాసిన గోపాలకవి తెలుగువాడే.
  5. 1857వ సంవత్సరం ఆంగ్లేయులపై జరిగిన ప్రథమ స్వాతంత్ర్య తిరుగుబాటుకు పదేండ్లు ముందే 1847లో తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసినాడు.
  6. బ్రిటీష్ మహారాణి విక్టోరియా ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపడం లేదంటూ, ధైర్యంగా ఆంగ్లేయ ప్రభుత్వానికి ఎత్తిచూపిన మొదటి భారతీయుడు 'గాజుల లక్ష్మీనరుసు శెట్టి' అనే తెలుగువాడు.
  7. తెలుగులో వచ్చిన మొట్టమొదటి వార్తా పత్రిక సత్యదూత. ఇది 1835లో, ఇప్పుడు కర్ణాటకలో వున్న అచ్చ తెలుగు ప్రాంతమైన బళ్ళారి నుండి ప్రచురితమయ్యేది.
  8. అచ్చ కన్నడ జిల్లాలుగా పేరుపొందిన మైసూరు, మండ్య, శివమొగ్గ, చామరాజ నగరు జిల్లాలలో కన్నడ మాతృభాష కలిగిన మంగలివారు ఒక్కరూ లేరు. అందరూ తెలుగువారే
  9. కర్ణాటక మొట్టమొదటి ముఖ్యమంత్రి కేశంపల్లి చెంగలాయ రెడ్డి తెలుగువారే.
  10. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపకులు డా॥ హెగ్గేవార్ మాతృభాష తెలుగు.
  11. మహారాష్ట్రకు ఒకప్పటి ముఖ్యమంత్రి డా॥ కన్నంవార్ తెలుగువారే.
  12. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై తెలుగువారేననీ, వారి తల్లి పేరు బంగారమ్మ అనీ ఆంధ్రులకు మొట్టమొదట తెలియజేసినది స్వర్గీయ మరుపూరు కోదండరామిరెడ్డి.

స్పందనను వ్రాయండి
______________
'అమ్మనుడి'లో రచనలపై మీ స్పందనలు వ్రాసి పంపండి!

సంపాదకుడు 'అమ్మనుడి',
జి-2, వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కళాశాల వీధి,
మాచవరం, విజయవాడ-520 004.
ఇ-మెయిల్ : editorammanudi@gmail.com

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

11