పుట:Ammanudi April-July 2020.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మలేసియాలో తెలుగు రక్షకుడు, ఉపాధ్యాయుడు

బుద్ద అప్పలనాయుడు

మలేసియా (మలయా) ప్రవాసాంద్ర ప్రముఖుడు బుద్ద అప్పల నాయుడు మాష్టరు (100 సం॥) 2020 మే 5తేదీన (మంగళవారం), మలయాలో మధ్యాహ్నం మృతి చెందారు.

అనకాపల్లి గవరపాలెంకు చెందిన బుద్ద మహలక్ష్మమ్మ, బుద్ద మారయ్య దంపతులు తమ ముగ్గురు సంతానం కుమారుల్ని వెంటతీసుకుని 1928లో మలేషియాకు వలసవెళ్లి పోయారు. వారి సంతానంలో రెండోవాడైన అప్పలనాయుడు అక్కడే చదువుకొని, ఉపాధ్యాయునిగా వృత్తి నిర్వహణలో తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. మలేసియా కెడా రాష్ట్రానికి చెందిన పెలాం ఎస్టేటులోని తెలుగు పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు.

వృత్తి రీత్యాను, ఇతర సాంఘిక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మలేషియా తెలుగు సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన అప్పలనాయుడు మాష్టరును, మలేసియా రాజు 1978లో ఆదేశంలోని అత్యున్నత పురస్కారం పి.జె.కె. బిరుదుతో సత్మరించారు. రెండు, మూడు తరాల మలేసియా ప్రవాసాంధ్రులు ఆయన వద్ద విద్యనభ్యసించిన వారే. ఆయనకు ఆరుగురు కుమార్తెలు. వారిలో ముగ్గురు కుమార్తెలు ఇప్పుడు విశాఖ జిల్లాలో వుండగా, రెండో కుమార్తె డా॥ మార్గరెట్‌ లండన్‌లో ప్రముఖవైద్యురాలు. ఇద్దరు కుమార్తెలు మలయాలోనే నివసిస్తున్నారు. 1955లో స్థాపించిన మలేసియా 'కూలిం' శాఖకు చాలా సంవత్సరాల పాటు అధ్యక్షునిగా వ్యవహరించారు. గత ఏడాది మరణించిన మలేసియా తెలుగు సంఘం వ్యవస్థాపకులు ముదిని సోమునాయుడుకు అత్యంత సన్నిహితునిగా సంఘ కార్యక్రమాలలో పాలుపంచుకున్న తెలుగు భక్తుడు.

మలేసియాకు వలస వెళ్లిన తొలి తరం తెలుగు వారు పడిన కష్టాలను చిత్రిస్తూ 2006వ సం॥లో 'మధుర స్మృతులు పేరిట కొన్ని కధలు రాశారు. తొలి తరం తెలుగు వారి వాడుకభాషను అప్పలనాయుడు గొప్పగా చిత్రించారని పలువురు భాషాభిమానులు కీర్తించారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

నూకాంబిక భక్తుడయిన అప్పలనాయుడు మాష్టరు దేవస్థానం మండపం విస్తరణకు భూరీవిరాళం అందజేశారని నూకాంబికా దేవస్థానం మాజీ ఛైర్మన్‌ (మాష్టరి అల్లుడు) కొణతల వెంకటరావు తెలిపారు. తెలుగు మాత ముద్దు బిడ్డ, విశాఖజిల్లా భూమి పుత్రుడు బుద్ద అప్పలనాయుడు అనకాపల్లికి మలయాలో మంచి గుర్తింపు తెచ్చారని సీనియర్‌ జర్చలిస్ట్‌ బి.వి. అప్పారావు నివాళులర్సించారు.

తెలుగు భాషోద్యమ సమాఖ్య

“క్రీ.శే. ముదిని సోమినాయిడుగారితో పాటు బుద్ద అప్పలనాయుడుగారు “నడుస్తున్న చరిత్ర " అభిమానులుగా నాకు ఆస్తులు. సుదూర దేశాలకు వలసవెళ్లినా అక్కడ తమ అమ్మనుడి తెలుగుకోసం జీవితమంతా శ్రమించిన వీరు తెలుగు జాతి వారందరకూ ఆదర్శం - అంటూ వారిరువురికి తెలుగు భాషోద్యమ సమాఖ్మ అధ్యక్షుడు డా॥ సామల రమేష్‌బాబు నివాళులర్చించారు.


“అమ్మనుడి చదువరులకు విన్నపం

కరోనా మహమ్మారి కాటు వల్ల మూడు నెలలపాటు పత్రికలను ప్రచురించలేకపోయాం. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభంలో మన దేశమూ, ప్రాంతమూ కూడా లాక్‌డౌన్‌లో ఒదిగిపోవలసివచ్చినందున ఈ పరిస్థితి ఏర్పడిందని మన అందరకూ తెలిసిందే.

మార్చి నెల చివరివారంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మూడు వంతులు సిద్ధమైన ఏప్రిల్‌ నెల సంచికను పూర్తి చేయకుండా ఆపివేయవలసివచ్చింది. ఇప్పుడు 'లాక్‌డౌన్‌'లో సడలింపు ఏర్పడడంతో - పత్రికలో కొన్ని మార్చులు చోటుచేసుకున్నాయి. పాత వార్తావిశేషాలను కొన్నిటిని తొలగించి, కొన్ని కొత్త అంశాలను చేర్చవలసి వచ్చింది. జులై సంచికగా దీనిని వెలువరిస్తున్నా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలతో కలుపుకొన్న సంచికగా స్వీకరించ ప్రార్ధన.

ఏప్రిల్‌ మే, జూన్‌ సంచికలను అందజేయలేనందుకు చింతిస్తూ, ఎప్పటివలెనే పాఠకులు పత్రికకు తమ ఆదరాభిమానములను అందించగోరుచున్నాము.

- సంపాదకుడు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై-2020

5