పుట:Aliya Rama Rayalu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేసె ననియు, 'కోఱియా, ఫెరిస్తా' లు వ్రాసియున్నా రని యారవీటివంశ చరిత్రమునందు దెలుపబడినది. వీరివ్రాతలంతగా విశ్వాసపాత్రములు గావు. ఈవిప్లవ సందర్భమున విజాపురసుల్తాను దురాశతో జేసిన దురాలోచనలను పొందినయమిత పరిభవమును గప్పిపెట్టుటకును, అళియరామరాయలప్రజ్ఞాప్రతిష్టలను గొంచెపరచుటకును వ్రాసినవ్రాతలుగాని యన్యములుగావు. "ఆలీఇబూ అజీజుఅల్లాతబతాబాయి" అనుచరిత్రకారుడు తానువ్రాసిన 'బురహాన్; ఈ. మా అసిర్‌' అనుగ్రంథమున విజాపురసుల్తాను తానెవ్వరివలన నాహూతుడుగాక తనంతతానే విజయనగరమునకు వచ్చె ననియు, సలకముతిమ్మయ సుల్తానుకు ద్రవ్యము నొసంగ లేదనియు, సుల్తానురాక విని సలకముతిమ్మయ విజయనగరమును విడిచి పాఱిపోయెననియు, విజాపురసుల్తానుసేనాని యగు అసాదుఖాను విజయనగరమునకు రావలసినదని సలకముతిమ్మయకు జాబుకూడ వ్రాసె ననిదెలిపి యున్నా డనియారవీటివంశ చరిత్రమునందే వక్కాణింపబడి యున్నది. అహమ్మదు నగరమున నైజాంషాహా దర్బారుననుండి వ్రాసిన 'మహమ్మదుఖాసిం ఫెరిస్తా' వ్రాతలనమ్మవలయునా? 'ఆలీఇబూఅజీజు అల్లాతబతాబాయి' వ్రాతలునమ్మవలయునా? మఱియు 'బసాతిన్ - ఉన్ - సలాతిన్‌' అనుఫారసీభాషాగ్రంథమున సలకముతిమ్మయ విజాపురసుల్తానుకు 44 లక్షల హొన్నులద్రవ్యము నొసంగెనని వ్రాయుచు మఱియొక సమాచారము వలన 80 లక్షల