అట్లువేటాడుకాలము సమీపింపగా నొకనాటివేకువను వేటకాండ్రతో నిబ్రహీము గోల్కొండదుర్గమును విడిచిపోయె నట. అతడు వెడలిపోయినవెంటనే దుర్గద్వారములు మూసివేయబడిన వట. నాయకు లెల్లరును తమసంకల్పము నెఱవేర్చుకొన గోరిమహమ్మదీయుల నెదుర్కొని సంహరింప మొదలుపెట్టి రట. మహమ్మదీయులలోనిరువు రెట్లోతప్పించుకొనిపోయి యాదు:ఖసమాచారమును సుల్తానుకు నివేదింపగా ఇబ్రహీము తక్షణమె తనతోనున్నసైన్యములకు రాజధానికి మరలవలసినదని యుత్తరువుచేసి తనసైన్యములతో మరలివచ్చి దుర్గముచుట్టును విడిసియుండె నట. కుట్రదారులగు నాయకులు బురుజులపైకివచ్చి యాసైన్యము నంతయునుగాంచి వార లీవిధముగా నిబ్రహీమునకువర్తమాన మంపిరట.
"సుల్తాను ముస్తఫాఖానుని తమవశ్యముగావించినయెడల వెనుకటివలెనె యాతనికి విధేయులమై తమవిధులను నెరవేర్పనున్నార మనియు, ముస్తఫాఖాను మంత్రిత్వపదవికి వచ్చినప్పటి నుండియు కొందఱునాయకులపట్ల బహుక్రూరముగా బ్రవర్తించి హింసించె ననియు దమగతియు నట్లేయగు ననిభయపడుచున్నార మనియు గావునముస్తఫాఖానును దమపరము చేయవలసినదిగా గోరుచున్నాము."
అప్పుడుసుల్తాను ముస్తఫాఖానుని రప్పించి నీపరిపాలన మెట్టిదుస్థితికి దెచ్చినదో చూచితివా యని యావిషయమును వానికి వినిపించె నట.