ప్రకరణము ౧౬ - రామదాసుచరిత్రము
81
ఖజానాపైకము ఆఱుసంవత్సరములది నిలువయైనదని మాదన్న కడనుండి దూతవచ్చి చెప్పెను. భక్తిపారవశ్యమున నుండిన గోపన్నకు ఆమాటలు ఎక్కలేదు.
ఈలోపల రాజధానిలో చాల మార్పు లేర్పడినవి. అక్కన్న మాదన్నల యధికారమునకు లోపములేదుగాని వీరికి శత్రువు లేర్పడిరి. రెండుపర్యాయములు ఆశత్రువులు చాడీలు చెప్పియు తానాషా వినలేదు. తామే వారినిచంపుటకు ప్రయత్నించియు ఫలింపలేదు. రామదాసుచర్యలు అత్తిమత్త షేక్ మిౝహాజులకు తెలిసినది. ఊరంతయు గందరగోళముగానుండు కాలమున తానాషాపేరిట గోపన్నను తర్కింపసాగిరి. గోపన్నయు వారుపెట్టుబాధలను సహించెనేగాని మామలకు చెప్పి పంపలేదు. ఆదుర్మార్గులు రహస్యముగా తమకు క్రిందిసర్దార్ల చేత గోపన్నను చెఱలోపెట్టించి క్రమముగా నొకదినము తానాషా అండనుచేరి భద్రాచలము తాసిల్దారు సర్కారుఖజానాకు పైకముపంపక భక్షించెనని చెప్పిరి. వెంటనే దర్బారులో విచారణ జరిగెను. అది వాస్తవమే. మాదన్న ఏమియు బదులు చెప్పటకులేక ఆవిషయము ఈ దేశోపద్రవకాలములో తమ కింకను తెలియరాలేదనియు ఎవరైననేమి న్యాయముప్రకారము శిక్షింపవలసినదే అనియు సభలో నుడివెను. ఆమాటయే చాలునని మిౝహాజుపక్షమువారును అంతఃపురములోనివారును గోపన్నను తీవ్రముగ శిక్షింపవలసినదని తానాషాను పురికొల్పుచుండిరి. తానాషా గోపన్నను పిలిపించెను, విచారణ జరిపెను.
- 6