ప్రకరణము ౧౩ - కుట్రలు, కుయుక్తులు
71
గోలకొండ పతనములోనిది ప్రథమసోపానము. రాజద్రోహపరంపరలో నిది మొదటివిజయము. ఈ సేనాపతిచేసిన ద్రోహము హైదరాబాదును తలక్రిందులుచేసెను. రాజ్య రక్షణప్రయత్న మంతయు భగ్నమాయెను. ఇంకను చాల సైన్యము సురక్షితముగానున్నను తానాషాకు ఏదో అధైర్య మేర్పడెను. తానుచేసినది సరికాదేమో అని సందేహింప నారంభించెను.
మిౝహాజ్యొక్క కుట్రచేత మాదన్నమర్యాద పోలేదుగాని భాగ్యనగరము (హైదరాబాదు) అభాగ్యమాయెను. గోలకొండసైన్యము పాఱిపోవుటయు వెంటనే సుల్తాను నగరమువదలి కోటలో చేరుటయు షాఆలమునకు తెలియుటకు మునుపే ఊరిలో అల్లకల్లోలములు రేఁగినవి. సుల్తాను తనకు సాధ్యమైన వస్తువులు, నగలు, నాణెములు, రత్నములు, రూప్యములు గ్రహించి స్త్రీలతోకూడ కోటకు పాఱిపోయెనని జనులు రచ్చచేయసాగిరి. వర్తకులును సిబ్బందియు వెనుకనుండి కోటలోనికి పరుగిడసాగిరి. సామాన్యగృహస్థులును రక్షణ కొఱకు దిగులుపడసాగిరి. ఎక్కడివా రక్కడ పాఱిపోవుటకు సిద్ధులైరి. సొత్తు, ఇల్లు, వాకిలి ఎట్లుపోయిననేమి, ప్రాణమానము లుండిన చాలునని కొందఱు బంధుమిత్రులతో పరారియైరి. స్త్రీలు బురఖాలు తగిలించుకొనుటకుకూడ అవకాశము లేకపోయెను. ఇంతలో దొంగలు కొల్లగాండ్రు దోపిడీలు మొదలు పెట్టిరి. సుల్తాను కోటలో ప్రవేశించిననాటి రాత్రియంతయు