ప్రకరణము ౧౧ - పాదుషా ప్రయత్నములు
57
తనస్థానాధిపతికి వ్రాసిన యొకజాబులో నీవాక్యము లుండినవి. “వీఁడు (తానాషా) దురదృష్టవంతుఁడు. ఒక కాఫిరువాని (మాదన్న) చేతిలో రాజ్యమునువదలి గొప్పగొప్పసయ్యదులను, షేకులను, పండితులను వానికి లోఁబఱచియున్నాఁడు. ప్రత్యక్షముగా సకలపాపములను చేయుచున్నాఁడు... ఇస్లామునకును కాఫిర్లమతమునకు భేదము తెలియకయున్నాఁడు. ఆకాఫిరు శంభువు (శంఖాజీ) నకు లక్షహొన్నుల నిచ్చినాఁడు. నాస్తికులతోనే వీనికి స్నేహము. భగవంతుని నియమముల నుల్లంఘించి దేవమానవులకు దూరమై పోవుచున్నాఁడుగదా!”
కాని వాస్తవముచూడఁగా తానాషామహాత్ముఁడు. తండ్రి మరణానంతరము పదునాలుగేండ్లు ఒకమహాత్ముని పరిచర్య చేసి యుండెను. ఇప్పటికిని ఆయనను దర్శించుచుండును. సత్పాత్రమందు రాజ్యమునుంచి వేదాంతగోష్ఠియందు కాలము గడపు చుండెనుగదా. కాని రాజకార్యములలో అప్రమత్తుఁడై స్వయముగా నన్నిటిని గ్రహించుచు సమయము దొరకినపుడెల్ల ఉర్దూ పారసీభాషలలో కవిత్వముచేయుచు నుండెను.
ఇట్టిసందర్భమున దక్షిణరాజ్యములకు మొగలాయీల వలనిబాధ తప్పదని తలఁచి గోలకొండమాదన్నపంతులు మహారాష్ట్రులతోను బిజాపురీయులతోను సఖ్యమే చేయుచుండెను. ఎట్లును బిజాపురమునకు గోలకొండవారిసాయము తప్పదని ఢిల్లీ పాదుషా ‘ఎంతమాత్రమును బిజాపురమునకు సాయపడవలదు; పడితివా నీకును అంత్యకాలము సమీపించును.’ అని తానా