30
అక్కన్న మాదన్నల చరిత్ర
కడపజిల్లాయును కర్నూలుజిల్లాలోని తూర్పుభాగమును నేటి హైదరాబాదునందలి కల్యాణీజాగీరువఱకుగల భాగమంతయు ఇందులోనిదే. ఏవో ఒకటిరెండుప్రదేశములు తప్ప ఆంధ్రదేశ మంతయు తానాషాపరిపాలనలో నుండెను. నాటి యాంధ్రదేశమున బంగారము పండుచుండెననిన అతిశయోక్తి కానేరదు. బిజాపురమునందలి నిస్సారప్రదేశమును వదలి తెలంగాణమును ప్రవేశించినంతనే పచ్చని పైరుపంటలు చూపరుల కానందమును గొల్పుచుండినవి. ఫలవృక్షములు నేత్రోత్సవము సేయుచుండినవి. ఈదేశపు వజ్రపుగనులును విశేషవ్యాపారస్థానములైన రేవుపట్టణములును ఖండాంతర ద్వీపాంతరములందు ప్రసిద్ధి నందియుండినవి. తానాషాసుల్తానునకు సంవత్సరమునకు దాదాఁపు మూఁడుకోటుల రూపాయల యాదాయ ముండెను. ఈమొత్తము సుల్తానుయొక్క సకలవినోదాదికములకును చాలి పై పెచ్చు రాజ్యరక్షణకొఱకు విదేశీయులకు వార్షికము లిచ్చుటకుసయితము చాలియుండెను. ఈవైభవమే శత్రువులకు కనుకుట్టాయెను. మొగలాయీలకు ఈసంపదనంతయు చూరగొను దురాశ పొడమెను,
ఔరంగజేబు సింహాసన మెక్కినతర్వాత ముప్పదిసంవత్సరములవఱకు గోలకొండసామ్రాజ్యమునకు శాంతియుండెను. ఇందులకు కారణము, బిజాపూరువలె, గోలకొండ మొగలాయీలను ప్రత్యక్షముగా నెదుర్కొనకపోవుటయే. ఇంతవఱకును మొగలాయీలకు, శివాజితోను అతనిస్నేహితుఁడైన