ప్రకరణము ౬ - మాదన్న పరిపాలనాప్రారంభము
29
వారేకారు. వీరు, సుల్తాను రాజకార్యముల వివరములు తనకు వలదనినను, ఆయనకు నివేదించుట ధర్మమనియు, మర్యాదయనియు చెప్పుచు అతనిని చాల అనుసరించుచుండిరి. భగవంతుఁడు తన కింతటి మంచిమంత్రుల నిచ్చెనుగదా యని తానాషా సంతసించుచుండెను.
మాదన్న మంత్రియైన కొలఁది కాలమునకే దేశమును బాగుపఱిచెను. మొదటిపనిగా కొండలలోనుండి దేశోపద్రవము చేయు జాతులవారిని శిక్షించి పైరుపంటలకు రక్షణ యొసంగెను. జనులను పీడించు జమీందారులను సుంకాధికారులను లాగివేసి సాధువులను ధర్మపరాయణులను వారిస్థానమున నియమించెను. ఈవిధముగా నన్నిజిల్లాలను నిష్కంటక మొనర్చెను. తర్వాత ఆన్నిసుబాలలోను గ్రామగ్రామముగా తనిఖీచేయించి వివరముగా పన్నువసూలు పట్టీలు ఆయాసంవత్సరములకు ప్రత్యేకముగా తయారుచేయించెను. ఇందువలన జనులకు కొంతనెమ్మది యేర్పడెను. ఇనాములు, అగ్రహారములు, దేవ బ్రాహ్మణదానములు, ‘నౌకరీ ఇనాములు’ మొదలైనవాని పాలనలోని అక్రమములను మాన్పించెను. తాను క్రొత్తగా పెక్కు దానములను ఇనాములను ఇచ్చెను. హిందూమహమ్మదీయులకు పక్షపాతములేక శిక్షణ రక్షణ లొసంగుచుండెను,
గోలకొండసామ్రాజ్యము చాలవిస్తృతమైనది. ఉత్తరమున శ్రీయకుళము మొదలు దక్షిణమున పుదుచ్చేరివఱకును, ఆంధ్రదేశమంతయు నీ విశాల సామ్రాజ్యమున చేరియుండెను.