22
అక్కన్న మాదన్నల చరిత్ర
భానూజీపంతులు కొమారుల యభివృద్దిని ఎఱిఁగి సంతోషించినను ఓరుగంటిలోనే యుండెను.
ఇట్లుండ ఒకనాఁడు అన్నదమ్ముల కిరువురకును చాల మంచి కలలు వచ్చినవి. వెంటనే మేల్కొని వారు ఒకరితో నొకరు చెప్పుకొనిరి. తెల్లవారిన తర్వాత స్నానాది నామధారణము లైనవెనుక పూజాగృహము ప్రవేశించిరి.
మాడుపల్లి కృష్ణభట్టుగారు వారి పురోహితులు. సోదరు లిరువురును వారిని సమీపించిరి―‘భట్టుగారూ, జపమైనదా?’
భట్టు―‘ఆ అయినది నాయనా, ఇంద తీర్థము’ అక్కన్న మాదన్నలు తీర్థము గ్రహించి భట్టుగారిముందు పీటపై కూర్చుండిరి.
అక్కన్న―భట్టుగారూ, మాకిఱువురకు నిన్నరాత్రి అద్భుతమైన స్వప్నములు వచ్చినవండీ; చాల ఆశ్చర్యముగా నున్నది. వాని ఫలము తాము చెప్పవలెను.
భట్టు―శుభము, శుభము. మీకు ఇటీవలనే సుల్తాను దర్శనము, రాత్రి శుభస్వప్నము. ఈ గోలకొండసామ్రాజ్య ధౌరేయు లగుదురుకాఁబోలు. చెప్పుడు బాబూ.
అక్కన్న ― తమ యాశీర్వచనము. మూఁడవజామున నేను ఎక్కడనో దేవాలయములో నున్నాను. చుట్టును భక్తులనేకు లుండిరి. తటాలున దీపారాధన జరిగినది. ఎదుట భగవతి భవాని కనఁబడుచున్నది. విగ్రహము కాదు. దేవి ప్రాణముతో నుండెను. చేతుల నాడించుచు ఎల్లవారిని చూచుచు