ప్రకరణము ౨౩ - తానాషా కడపటివిందు
119
కాలము ముగిసినవెంటనే ఈ రాజ్యాధికారమును ఆస్తికుఁడైన అలంఘీరుపాదుషాచేత ఉంచుచున్న భగవంతునికి వందనము లాచరించుచున్నాను. ఇదంతయు దైవచిత్రము! రండు భోజనమునకు.”
భోజనానంతరము తానాషా తనగుఱ్ఱమున కాజ్ఞాపించెను. శరీరమున విశేషవస్తువు లేవియు ధరింపక మెడలోనొక ముత్యాలహారమును మాత్రము ధరించి మొగలాయీ సర్దారులతో బయలుదేరెను. ఆతఁడు ముందుపోవుచుండఁగా వారు ఆతనివెనుక వచ్చుచుండిరి. ఆదృశ్యము చంద్రుని చుట్టు ప్రభ గుడికట్టిన ట్లుండెను. ఆమహనీయుఁడు పెండ్లినాఁడు కూడ ఇంత నెమ్మదిగా నడచియుండఁడు. ఆతని మొగమున నెట్టి భావమును లేదు, శాంతి తాండవించుచుండెను. పాదుషా పుత్రుఁడు మహమ్మద్ ఆజాం కోటకు బయట నొక గుడారమున నుండెను. తానాషా వచ్చుచున్నాఁడని సేవకులువచ్చి చెప్పఁగానే లేచి గుడారము వాకిట నిలిచి ఎదురుచూచు చుండెను. తానాషావచ్చి గుఱ్ఱముదిగి ఆజామునకు తనమెడలోని హారమునువేసి బహుమానించెను. రాజకుమారుఁడు దానిని గ్రహించి తానాషాను కౌఁగలించుకొని చాలదయతో ఓదార్పు పలికి పాదుషా కడకు కొనిపోయెను. ఎల్లవారిని క్షమించునట్టి ఔదార్యమును ప్రకటించుచు పాదుషా తానాషాను చాల మర్యాదతో చూచి ఆతఁడు తనసభలోనికి తన సర్దారులవలె వచ్చి నిలిచి యుండవలసిన యక్కఱ లేదనియు స్వేచ్ఛగా నుండవచ్చుననియు పలికి గౌరవించెను.