94
అక్కన్న మాదన్నల చరిత్ర
దనియు మానవులచరిత్రములు ఎంతమాత్రము పనికిరావనియు పాదుషా వానినెల్ల తుడిపించెను. చాలమనోహరములైన చిత్రములు పాడైపోయినవి. ఆతర్వాత రెండుసంవత్సరములకు ప్లేగువ్యాధి బయలుదేరి దాదాఁపు సగము జనమును తినివేసినది. ఊరంతయు పాడుపడినట్లయినది. ఏకారణముచేతనో ఎప్పుడును సమృద్ధిగానుండు బావులుకూడ ఎండిపోయినవి. ఊరిలో గొప్పగోరీలు అలంకరణములవలె నుండుచు బిజాపురమునకు ఎప్పుడును ప్రత్యేకశోభను కూర్చెడివి. ఇప్పుడు ఆ గోరీలే ఆయూరిని శ్మశానమువలె చేసినవి. ఎంతదూరముపోయినను పడిపోయిన భవనములు, గొప్పబురుజులు, మసీదులు, నిర్మానుష్యమైన వీథులు, అచ్చట వీథులలోనే మహావృక్షములు మొలచి వీనిని చూచుకొనువారు పోయిరని చెప్పునట్లుండినవి. పెక్కుసాధనములమీఁద సయితము చెట్లు మొలచియుండినవి. పక్షులగూండ్లును, అందుండి పక్షుల యఱుపులును, గబ్బిలముల కంపునుతప్ప ఆపాడుపడిన ఇండ్లలో విశేషములు లేవు.
పాదుషాకు పాదాక్రాంతుఁడైన సికందర్ఆడిల్షా ఏమియు సుఖపడలేదు. కొంతకాలము పాదుషాతో నూరేఁగిన యనంతరము, ఆతఁడు తనరాజ్యములోని కృష్ణ కుత్తరభాగము తనకు సామంతరాజ్యముగా ప్రసాదింపుమని ఎంత ప్రార్థించినను వినక పాదుషా సికందరును చల్లగా దౌలతాబాదులోని చెఱసాలకుపంపెను. ఆ గిరిదుర్గములో నాతఁడు తన జీవిత శేషమునంతయు నిట్టూర్పుచు గడపెను. కొంతకాలము బందిలో