పుట:Adhunikarajyanga025633mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"యజమాని కోపించిన నిరుద్యోగప్రాప్తి యగునేమో" యని భయోత్పాదులగునంతవరకు, "మన యిష్టమువచ్చినటుల రాజ్యాంగవ్యవహారముల చర్చించిన రాచకీయ పెత్తనము కోరినచో, దారిద్ర్యప్రాప్తి యగునేమో" యను సంశయము సంభవించునంతవరకు సాధారణార్ధిక స్వాతంత్ర్యము ప్రజలకు సంప్రాప్తించదు. కనుకనే ఇంగ్లండు, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, కెనడాదేశములందు ప్రతి కార్మికునకు యుద్యోగప్రాప్తి కల్గించి, నిరుద్యోగులైనవారికి పోషణకల్గించి, వృద్ధులైనను, అవిటివారైన అనాధలగుప్రజలకు జీవనోపాధి యేర్పాటుచేసి, అనారోగ్యులకు మందుమాకుల నుచితముగా నొసంగి, చూలాలులగు స్త్రీలకు భత్యమిచ్చి, స్వరక్షణార్ధమై కార్మికులకు తమ తమ సంఘముల స్థాపించుకొను యర్హతకల్గించి, ప్రభుత్వమునకు సంబంధించినంతవరకు కార్మికులను వారియజమానులతో సమానులుగా పరిగణించి ఆదేశముల ప్రభుత్వములు సాధారణప్రజలందరకు ఆర్ధికదాస్యముబాపి, ఆర్ధికస్వాతంత్ర్యము కల్గించుచున్నవి. ప్రజలయందు ప్రచారితమైయున్న ప్రస్తుతపు భాగ్యవిభజనపద్ధతిని సక్రమమగు, శాంతియుతమగు, శాసనబద్ధమగు రాచకీయాందోళనద్వారా తగురీతి మార్పుజేసి, ప్రజలందరిమధ్య దేశసౌభాగ్యము దాదాపుగా సమానముగా పంచిపెట్టబడుటకు రాజ్యాంగవిధానము అవకాశముల నొసంగు టగత్యము. కాని ప్రపంచమునం దీయుగమున