పుట:Adhunikarajyanga025633mbp.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధులు, బహుజనసంఘమునకు ద్రోహముచేసినను, పదభ్రష్టులగుట దుర్ఘటము; తమప్రత్యేకమతస్థుల స్వలాభమునకై, ప్రజాసామాన్యపుక్షేమమును సంకుచితపరచుట వారికిసాధ్యమగును; వారిఆలోచనలు, ఆచరణలు, వారివారి మతస్థుల ప్రత్యేకావసరముల ననుసరించియే యుండును. ఇందువలన, ప్రత్యేకసాంఘిక ప్రాతినిధ్యతద్వారా వచ్చు సభ్యులచే, శాసనసభలు నింపబడుటయు, జనసామాన్యపు ప్రతినిధులు, అందుహెచ్చుగాలేకుండుటయు, "ఎవరికివారే, యమునాతీరే" అనుప్రతినిధులు మెజారిటీయందుండుటయు, తన్మూలమున, ప్రజాసామాన్యపు అవసరముల గమనించువారు తగినంత మంది లేకుండుటయు అనుభవసిద్ధమగుచున్నది. ఇట్టిపరిస్థితులందు, ఏ శాసనసభయైన, ప్రజలెల్లరిలాభమునకై, ఉమ్మడి అవసరముల దీర్చుటకై, జాతీయాభివృద్ధి కల్గించుటకై అవసరమున్న, వ్యక్తులయొక్కయు, ప్రత్యేకపు సంఘములయొక్కయు సౌకర్యముల కొంతవరకైన తగ్గించుటకు, ఎటులసాధ్యమగును? ఏశాసనసభయైనను దేశమందలి ప్రజలయొక్క సర్వసాధారణమగు అభిప్రాయముల వెలిపుచ్చుచూ, ప్రజాక్షేమార్థమై అగత్యమగు కార్యముల జేయించ నుత్సాహపడుచుండవలయును. ప్రతిసభ్యుడును, తాను ప్రజాసామాన్యపు టభిప్రాయముల కోరికల