పుట:Adhunikarajyanga025633mbp.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహమ్మదీయనాయకులు జూపెట్టుచున్నారు. మరియు బెంగాలు, పంజాబురాష్ట్రములందు హిందూజమీందారులు, ధనికులు, వ్యాపారస్తులన్న, మహమ్మదీయపాటకపుజనమునకు హెచ్చు భయభక్తులు కలవుగాన, వారు తమ మతస్తులకే తమవోటులనిచ్చుటకుమారు హిందువులకొసంగుదురనియు, అందువలన మహమ్మదీయమతస్థులకు తగినంత ప్రాముఖ్యత శాసనసభలయందు కల్గుట దుస్తరమనియు మహమ్మదీయనాయకులు వాదించుచున్నారు. అసహాయులై యుండి, రాచకీయముగ అవిటివారైయున్న మైనారిటీమతస్థులకు, చేయూతను ప్రత్యేక ప్రాతినిధ్యముద్వారా యిచ్చుట మెజారిటీ మతస్థులధర్మమనియు, ప్రజాస్వామికముయొక్క అవసరమనియు, వారు ప్రచార మొనర్చుచున్నారు.

కాని, ప్రజాస్వామికము అందలిప్రజలెల్లరు తా మందరు సోదరప్రాయులమని తలంచి, తమ పరస్పరభేదముల తగ్గించుకొని, పరస్పరసామరస్యమును వృద్ధిపరచుకొని, పరస్పరముగా గౌరవవిశ్వాసముల బొంది, ఒకరితో నొక రోపిక పట్టియుండి అల్ప కారణములచే కోపగించుకొనకుండిననే జయప్రదమగునుకదా! వివిధమతస్థులు ఒకరినొకరు ద్వేషించుకొనుచు, పరస్పరముగా అవిశ్వాసముతో నుండి ప్రత్యేకప్రాతినిధ్యమునుకోరుచో, సంఘైక్యత, సంఘభ్రాతృత్వము వృద్ధిబొం