పుట:Adhunikarajyanga025633mbp.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్నారు. ఈపద్ధతి నగరరాజ్యములందును, గ్రామపంచాయితీలయందును, ఆకాలావసరములబట్టి అంతనష్ట దాయకముకాకున్నను, ఇప్పటిరాజ్యములందు మాత్రమెంతయు అనర్ధదాయకమగును. న్యాయశాస్త్రజ్ఞానములేనివారు న్యాయమూర్తులగుటయే అభిలషణీయముకాదు. పైగావారు ప్రజలచే, ప్రతిరెండు లేక నాల్గుసంవత్సరముల కొకమారెన్నుకొనబడుట మరింత అసంతృప్తికరము . ఫ్రాన్సునందు సాధారణ న్యాయస్థానములందలి న్యాయమూర్తులందరు న్యాయశాస్త్రపారంగతులై, యుద్యోగములందు ఖాయపరచబడియున్నారు. కాని, ప్రభుత్వమునకు ప్రజలకుమధ్యకల్గు వివాదముల వారు దీర్పనేరరు. "అడ్మినిస్ట్రేటివుకోర్టు"ల న్యాయమూర్తులు మాత్రము, ప్రభుత్వమున కేదో యొకవిధముగ లోబడియున్నారు. ఇది చాలయసంతృప్తికరమగు పర్యవసానముల కల్గించుచున్నది. ఇప్పటికన్ని దేశములందును, న్యాయమూర్తులు సక్రమవర్తనులై యుండునంతకాలము, తమ ఉద్యోగములందు సుస్థిరముగా నుండవలెననియు, వారిపై ప్రభుత్వమున కేలాటిపెత్తనము యుండరాదనియు, వారికి తమధర్మనిర్వహణమందు సంపూర్ణ స్వాతంత్ర్యము అవసరమనియు, వారిని ఒకచోటనుండి మరియొక చోటకు బదిలీచేయునప్పుడుకూడ వారి యిష్టాయిష్టముల గమనించవలెననియు రాచకీయజ్ఞులెల్లరు అంగీకరించుచున్నారు.