పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

అబలాసచ్చరిత్ర రత్నమాల.

వాజ్ఞాపింపఁగా బంధువులామెను బట్టుకొని బలవంతముగా కేశవపనము చేయించిరనియు, అందుపై నామె నదికిపోయి స్నానముచేయఁగా వెంటనే పూర్వమువలెనే కేశములు మొలిచెననియు, అదిగని గురువులును, బంధువులును మిగుల నాశ్చర్యపడి యటుతరువాత నామెజోలి మాని రనియుఁ గొందఱు చెప్పెదరు. ఏది యెట్లున్నను వెంగమాంబగారికి వితంతు స్త్రీలకు కేశవపనము చేయుట కిష్టము లేదనుట వాస్తవము.

వెంగమాంబగారికి నిష్టములేని యీకృత్యము ఏస్త్రీలకును సమ్మతంబు కానేరదు. మన దేశమునందు నంధపరంపరగా వచ్చిన యీయాచారమునకుఁ గాదనలేక కొందఱు యువతులు సమ్మతించినటుల నగుపడినను వారి యంతరముల యందు నపరిమితదు:ఖము కలిగియే యుందురు. వారివారి భర్తల మరణ సమయమునకంటెను కేశవిసర్జన కాలముల యందే వారధికదు:ఖితు లగుచుందురు. వపనకర్మవలన దమకును దమభర్తలకునునిజముగాఁ బుణ్యలోకములు దొరకునని వారికి నమ్మకమున్నయెడల వారాసమయములయందు దు:ఖించుటకు మారుగా నమితసంతోషమును బొందవలసినదే. స్త్రీలు పతివిహీనలై యలంకారరహితమై మంగళకార్యములకు దూరలై మితిమీరిన దు:ఖవహ్నిలోఁ బొరలుచుండ సుఖమునందున్నవారి బంధువులు మంచిమాటలతో వారిశోకాగ్ని నార్పుటకు మారుగా బరమేశ్వరుఁ డిచ్చినకిరీట మనఁదగిన కేశకలాపమును నేలపాలుచేసి యాదు:ఖాగ్నిలో నెయ్యిబోసి ప్రజ్వలింపఁ జేయుదురు. ఇది యెంతటి యన్యాయము ! ఈ దురాచారము సహగమనమునకంటెను దక్కువ క్రూరమై