పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వనలతాదేవి

బంగాళ దేశమునందలి నదియా జిల్లాలోఁ గృష్ణనగర మనుగ్రామమున శశిపాద బనర్జీయను బ్రాహ్మమతావలంబి పోష్టాఫీసులో సూపరింటెండెంటుగా నుండెను. ఈమహనీయుఁ డనేకసంవత్సరములనుండి హిందూవితంతు శరణాలయము నొక దానిని స్థాపించియున్నాఁడు. ఈ యౌదార్యవంతుని బిడ్డ లందఱును సత్కార్యములనే చేయుచున్నారు. వనలతాదేవి యీతనిపుత్రి. ఈమె 1879 వ సంవత్సరము డిశంబరు 22 వ తేదిని కృష్ణనగరమున జన్మించెను. చిన్నతనమునుండియే యీమె మిగుల సద్గుణవతియు, దయాశాంతాదిగుణసహితయు నయియుండెను. ఈమె బుద్ధిసూక్ష్మతను గని శశిపాద బనర్జీగారీమెకు బాల్యమునుండియే విద్య నేర్ప మొదలుపెట్టిరి. ఈమె యెనిమిది సంవత్సరముల దయినప్పటినుండియుఁ గవిత్వశక్తి యీమె కలవడియెను. వనలతాదేవికి సేవా, ప్రేమ, వైరాగ్యములను నీగుణత్రయం బెంతయుఁ బ్రియంబైయుండె. ఆమె నడవడిలోను, గవిత్వములోను, ఉపదేశమునందును ముఖ్యముగా నీమూఁడు శబ్దములు గానవచ్చుచుండెను. ఈమెకుఁగల మాతృ పితృభక్తియు, పతిప్రేమయు మిగులస్తుత్యములు. పదమూఁడు సంవత్సరముల వయస్సున వనలతాదేవి వరాహనగరమునందలి వితంతు శరణాలయములో 'సుమతీ సమితి' యను నొక స్త్రీ సమాజము నేర్పఱచెను. అంత చిన్న వయస్సుననే యామె తనతోడి బాలికలతో నేర్పఱచిన యాసమాజమునకు మర్యాద