పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణిస్వర్ణమయి.

285

తనభార్య విషయమై యాశాసనమునం దేమియు వ్రాసియుండ లేదు. ఈమరణశాసనము ప్రకారము రాజాగారి సొత్తంతయు కంపెనీవారు స్వాధీనపరచుకొనిరి. ఇట్లు యౌవనకాలమునందే పతివియోగము, ధననాశమును సంభవించినప్పటికినిరాణిగా రత్యంతధైర్యము నవలంబించి యాయాపదలతోఁ బోరాడుటకు నిశ్చయించిరి. తనసొమ్మున పహరించిరని మహారాణి గారు "ఈస్టు ఇండియాకంపెనీ" వారిమీఁద "సుప్రీంకోర్టు"లో నభియోగము తెచ్చిరి. భర్త చిత్తచాంచల్యము కలిగినప్పుడు వ్రాసినదికావున నామరణ శాసనము చెల్లఁగూడదని యచ్చట తీర్పు చేయఁబడినందున స్వర్ణమయి గారికిఁ దిరిగి తమ సొత్తంతయు లభించినది.

ఇట్లు పోయిన సంస్థానమంతయు స్వప్రయత్నముచేతఁ దిరిగి సంపాదించిన పిమ్మట మహారాణిగారు తనధనమును సద్వ్యయము చేయ నారంభించిరి. సంతతౌ దార్యముచే నీమె యుభయవంశములకును, దనసంస్థానమునకును భూషణతుల్యురాలాయెను. సత్కార్యముల కీమె చేయు నధిక ధనవ్యయమును జూడఁగా నీధన మీమెదికాక యీమెయొద్ద నెవ్వరైనను దాఁచిన ధనము నీమె యిట్లు పంచిపెట్టుచున్నదియేమో యని సందేహము కలుగుచుండెను. ఈమె ఫలాపేక్షలేక చేయుదాన ధర్మములందఱికి నీమెయందు మహాగౌరవమును గలుగఁజేయుచుండెను. ఒకటియని చెప్పనేల? ఈమె కేవలము ఔదార్యముయొక్క భౌతికావతారమనియే చెప్పవచ్చును. స్వర్ణమయి గొప్ప విద్వాంసురాలుగాదు; గొప్ప శాస్త్రములను చూడలేదు. ఐనను దేశక్షేమమునకును, బ్రజల సౌఖ్యమున