పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాందబీబీ.

267

వారలై మరలి శత్రువులతోఁ బోరసాగిరి. ఆదినమంతయు యుద్ధము జరిగెనుగాని చాందబీబీ శత్రువులను పట్టణములోనికిఁ జొరనియ్యకుండెను. అప్పు డామె యెక్కడఁజూచినను దానెయై బహుశౌర్యముతోఁ బోరాడెను. ఆసమయమునందలి యామె శౌర్యమునుగని శత్రుసైనికులు సహిత మాశ్చర్యపడిరని ప్రత్యక్షముగాఁ జూచి యతఁడే వర్ణించెను. అప్పుడు మురాద్ తనకు గెలుపుదొరకుట దుస్తరమని తెలిసికొని "మాకు వర్హాడప్రాంతము నిచ్చినయెడల మేము మాదేశమునకుఁ బోయెదమ"ని చాందబీబీకి వర్తమాన మంపెను. త్వరగా రాజ్యమునందలి యితరసై నికులువచ్చి తనకుఁ దోడుపడు లక్షణము లేమియు నగుపడనందున వర్హాడప్రాంతము చాందబీబీ వారికి నిచ్చి సంధిచేసికొనెను.

తదనంతరమునం దామె బహాదుర్‌ను కారాగృహము నుండి విడిపించి తెచ్చియతనికిఁ బట్టాభిషేకము గావించెను. అంతనామె అహమ్మదఖానను నాతని ప్రధానిగా నేర్పఱచి యాపిల్లవానిపేర తాను రాజ్యము నేలుచుండెను. కాని అహమ్మద్ ఖానునకు రాజ్యకాంక్ష మిక్కుటమైనందున అతఁడు చాందబీబీమాటను సాగనియ్యకుండెను. ఈసంగతి సైనికులకు దెలియఁగా వారాతనిఁబట్టి బంధించి చాందబీబీ స్వాధీనము చేసిరి. తదనంతర మాతనిపని నేహంగఖానను నాతని కిచ్చినందునచాందబీబీరాజ్యము సురక్షితముగా నేలఁదొడఁగెను కాని త్వరలోనే నేహంగఖాను రాణికి వైరియయ్యెను. ఈ సమయముననే మురాద్ శహాపురమునందు కాలము చేసెను. అంత నగ్బరుపాదుషా తనచిన్నకొమారుఁడగు డానియల్ అను నా