పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరసవాణి.

257

పూర్వకాలమునందలి సుందరులు విద్యలయందును, కళలయందును, పాండిత్యము కలవారయి పురుషుల కుపదేశము చేయఁదగినంత మంచిదశయందుఁగూడ నుండుచువచ్చిరి. - వేదమునందు వర్ణింపఁబడిన గార్గి, మైత్రేయి మొదలయినవారినే యిందుకు నిదర్శనముగాఁ జెప్పవచ్చును; ఆకాలమునందలి స్త్రీలు వేద వేదార్థము లెఱిఁగినవారని చూపుటకు శకుంతల మొదలయినవారిని దృష్టాంతముగాఁ గొనవచ్చును; యజ్ఞాదులయందును, వివాహాదుల యందును స్త్రీలు పఠింపవలసిన మంత్రము లుండుటయె మనపూర్వులు భాషాపాండిత్యము కలవారయి మంత్రార్థముల నెఱిఁగియుండవలెనని యుద్దేశించి నట్లు స్పష్టమగుచున్నది. ఆకాలమునందు స్త్రీలుపురుషులవలెనే గౌరవింపఁ బడుచుండిరిగాని యిప్పటివలె గదులలో మూసిపెట్టఁ బడుచుండలేదు. వారి కట్టిస్వాతంత్ర్యములు పూర్వకాలమునందుఁ గలిగి యున్నవని చూపుటకు సీత మొదలగు క్షత్రియ స్త్రీలు సహితము భర్తలతో వచ్చి సభలలో సింహాసనములమీఁదఁ గూరుచుండుచు వచ్చిన వార్తను సూచించుటకంటె విశేషమేమియుఁ జెప్పనక్కఱలేదు. ఇవియవి యని వేఱుగఁ జెప్పనేల? ఆకాలమునందలి స్త్రీలకుండవలసిన స్వాతంత్ర్యముల నన్నిటిని వారు గలిగియుండిరనుటకు సందేహము లేదు. వారి కప్పుడున్న విద్యాప్రభావమునుబట్టివా రట్టిగౌరవములకును స్వాతంత్ర్యములకును నర్హు రాండ్రయి యుండిరి. మనపూర్వులు గృహిణిధర్మములను వివరించుచు భర్తకుభార్య మంత్రివలె నాలోచనచెప్పవలెననియు, తల్లివలె నుపచారము చేయవలె