ఉమాబాయి దాభాడే.
ఈయుమాబాయి మహారాష్ట్ర రాజ్యసంస్థాపకుండగు ఛత్రపతి శివాజీగారి మనుమఁడగు శాహురాజు కాలమునం దుండినట్టు తెలియవచ్చుచున్నది. ఉమాబాయి మామగారగు ఏసుపాటిల్ దాభేడేయను నాతడు శివాజీగారివద్ద నొక భృత్యుఁడుగా నుండెను. కాని శివాజీ రెండవకుమారుఁడయిన రాజారాముగారి పరిపాలనదినములలో నాతఁడును అతనిపుత్రు లిరువురును స్వహితము నెంచక స్వామికార్యము నిర్వహించినందు వలన నాటినుండియు రాజు మెచ్చి వారికి సేనానిత్వ మొసంగెను. ఈయేసుపాటిలు పెద్దకుమారుని పేరు ఖండోజీ. ఖండోజీగారి భార్య పేరు ఉమాబాయి.
శాహుమహారాజుగారు ఢిల్లీనుండి స్వరాజ్యమునకు వచ్చిన వెనుక మరల మహారాష్ట్రులరాజ్య మించుక యున్న తావస్థఁ బొంద నారంబించెను. ఇట్టిసమయమునందు ఖండేరావు దాభాడే తన శౌర్యమువలన ననేక సంగ్రామములలో జయము సంపాదించి మిగుల నుతికెక్కెను. బాలాజీ విశ్వనాధపేష్వాగారును, ఖండేరావును ప్రాణస్నేహితులుగానుండిరి. కాని వారిరువురి యనంతరమునందు వారియుద్యోగముల కర్హులై వారిపుత్రులైన ప్రథమబాజీరావు పేష్వాగారికిని త్రియంబకరావు సేనాపతికిని తండ్రుల నాటిస్నేహభావము లేక వైరముప్రాప్తించెను! బాజీరావు ఉత్తరహిందూస్థానమును దాభాడే ఘూర్జరదేశము నపహరింపఁ దలఁచిరి. అప్పు డాయిరువు రొకరిపై నొక