పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మావతి.

225

తమ ప్రవర్తనవలన వారికి దారిఁజూపుచుండిరి. కొంతకాల మచటనుండి స్వగ్రామమునకుఁ బోయి యచ్చటనే కొన్నిరోజులకు వారు కాలధర్మము నొందిరి.

పద్మావతీదేవి రాజుభార్య కుపదేశించిన యుపన్యాస మొకటి యాంధ్రమహాభక్త విజయమునందుఁ గానుపించుచున్నది; గాని మహారాష్ట్రభక్తవిజయమునందు లేదు. ఆంధ్రభక్తవిజయకారుఁ డీయుపన్యాసము నెచ్చటినుండి సంగ్రహించెనో తెలియదు. అయినను నాయుపన్యాసము స్త్రీలకుఁ బాతివ్రత్యంబు గఱుపుటకు నత్యంతోపయుక్తముగా నుండుట వలన దాని నిందుఁ బొందుపఱుచుచున్నాను.

"అమ్మా! లోకములో సతులకు ముఖ్యముగాఁ గావలసిన ధర్మ మొక్కటిగలదు. పతికంటె వేఱుదైవముగాని, పతికంటె వేఱు గతిగాని పతికంటె వేఱు చుట్టముగాని, పతికంటె వేఱుసంపదగాని, పతిసేవకంటె నుత్కృష్టమగు పూజగాని పతియనుమతి నతిక్రమించుటకంటె పరమసాధనముగాని లేదనియు, పాతివ్రత్యమున కెప్పుడును భంగము రాకుండ కాపాడుకొనుచుండుటే బ్రహ్మజ్ఞానమనియు, పతి నామముననవరతము సంస్మరించుటే బ్రహ్మధ్యానమనియు, పతి నెడఁబాయకుండుటే బ్రహ్మానందమనియు, పతిమృతి నొందినతోడనే ప్రాణములు విడుచుటె మోక్షమనియు, నిశ్చయించుకొని వర్తించుచున్న సతికి సర్వశుభములును సులభముగా సిద్ధించును. పాతివ్రత్యమున కన్న నుత్తమమయిన వ్రతము మఱేదియును లేదు. లోకమునంగల జపతపో నియమాదు లేవియుఁ బాతివ్రత్యమునకు సమానములు కావు.